ఉగాది పండుగ వేళ ఓ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. సవతి పిల్లలను కాపాడబోయి వారితో పాటు ఆ తల్లి కూడా మృత్యువాత పడింది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం భిక్కనూరు పంచాయతీ వెంకటాపూర్ అగ్రహారంలో ఈ విషాదం జరిగింది. గ్రామానికి చెందిన బొమ్మర్ది లింగయ్యకు గతంలో మండలంలోని కళ్యాణి గ్రామానికి చెందిన శ్యామలతో వివాహం అయింది. కూతుళ్లు మైథిలి, అక్షర, కుమారుడు వినయ్ పుట్టిన కొన్నాళ్లకు శ్యామల అనారోగ్యంతో చనిపోయింది. దాంతో లింగంపేట్ మండలం షెట్పల్లికి చెందిన మౌనికను లింగయ్య వివాహం చేసుకున్నాడు. మౌనికకు కూడా ఇది రెండో వివాహమే. లింగయ్య కూలి పనులు చేసుకుంటూ తండ్రి లక్ష్మయ్య, భార్య మౌనిక (26), ఇద్దరు కూతుళ్లు మైథిలి (10), అక్షర (9), కుమారుడు వినయ్ (7)లతో కలిసి జీవిస్తున్నాడు.
శనివారం మధ్యాహ్నం మౌనిక చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్ళిపోవడంతో పిల్లలు కూడా వెళ్లారు.
మౌనిక పని చేసుకుంటుండగా చెరువులో స్నానానికి దిగిన పిల్లలు మునిగిపోతుండగా వారిని కాపాడబోయి మౌనిక కూడా నీట మునిగింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి చూడగా గట్టున వారి చెప్పులు, బట్టలు కనిపించాయి. పోలీసులు సమాచారం అందించగా, ఎల్లారెడ్డి DSP శ్రీనివాస్, CI రవీందర్ నాయక్, SI మహేష్ గజ ఈతగాళ్లతో వెతికించి ఆదివారం తెల్లవారుజామున నలుగురు మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వినయ్ గ్రామంలో రెండవ తరగతి చదువుతుండగా, మైథిలి, అక్షర మెదక్లోని ఓ ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటున్నారు. ఉగాది పండుగకు ఇంటికి వచ్చిన పిల్లలు మృత్యువాత పడడంతో బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఆత్మహత్యా? హత్యా? అన్న కోణంలో విచారణ:
తల్లి, పిల్లల మరణాలపై అనుమానాలున్నట్లు గ్రామంలోని కొందరు చర్చించుకుంటున్నారు. మౌనికకు భర్త లింగయ్యకు మధ్య కుటుంబ కలహాలుండేవని అంటున్నారు. ఈ క్రమంలో తల్లి, పిల్లల మరణాలు ప్రమాదవశాత్తు సంభవించినవా? లేక ఆత్మహత్యా? లేక హత్యా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లింగయ్యను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.