నగరంలోని కంచగచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, HCU విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. వాదనలు విన్న ధర్మాసనం, కంచగచ్చిబౌలి భూముల్లో ఏప్రిల్ 3 (గురువారం) వరకు పనులు ఆపాలని ఆదేశించింది. పిటిషన్పై తదుపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేసింది.
కంచగచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, HCU విద్యార్థులు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు కొనసాగాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) తరపున L.రవిశంకర్ వాదనలు వినిపించారు. గత ఏడాది జూన్లో రాష్ట్ర ప్రభుత్వం GO 54 తీసుకొచ్చింది. ఈ GO ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని TGIIC (The Greater India Innovation Centre)కు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా, సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి, ప్రభుత్వాలు పనులు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. కంచగచ్చిబౌలి భూముల వద్ద భారీ వాహనాలు ఉపయోగించి చెట్లను కొట్టడాన్ని, భూమిని చదును చేయడాన్ని ఆరోపించారు.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, అటవీ ప్రాంతాన్ని కట్ చేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి. వన్యప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే, నిపుణుల కమిటీ పర్యటించి, నెలరోజులపాటు అధ్యయనం చేయాలి. అక్కడ మూడు లక్షల మొక్కలు, రాక్స్, అరుదైన జంతువులున్నాయని, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని వాదించారు. అయితే, ఇక్కడ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. కొన్ని రోజులుగా ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని కూడా పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తరపున AG సుదర్శన రెడ్డి వాదనలు వినిపించారు. 2004లో ఈ భూమిని IMG అకాడమీకి అప్పగించారు. ఒప్పందం ప్రకారం IMG ఈ భూములను వినియోగించలేదు. అందువల్ల, అప్పటి ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసింది. ఆ భూముల్లో అటవీ భూమిగా ఎక్కడా పేర్కొనలేదు. దీనికి ఆనుకుని HCU భూముల్లో భారీ భవనాలు నిర్మించారు. నాలుగు హెలీప్యాడ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లు ఉన్నాయి. పిటిషనర్ల వాదనల ప్రకారం, ఆయా ప్రాంతాలను కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఈ లెక్కన, హైదరాబాద్ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదని AG వాదించారు.
ఇప్పటివరకు ఈ భూమి అటవీ భూమిగా ఎక్కడా ప్రకటించబడలేదు. కంచగచ్చిబౌలి భూములు అటవీ భూమిగా ప్రభుత్వం సైతం ఎక్కడా నోటిఫై చేయలేదు. ఇది పూర్తిగా పరిశ్రమలు మరియు ఇతర అవసరాలకు కేటాయించిన స్థలమేనని, అటవీ భూమిగా కాకపోయింది అని AG పేర్కొన్నారు. నిజాం కాలం నుంచి ఈ భూమి బీడు భూమిగానే ఉంది అని కోర్టుకు తెలిపారు. అయితే, ఈ 400 ఎకరాలు పరిశ్రమల భూమిగా రికార్డుల్లో ఎక్కడైనా ఉందా అని హైకోర్టు AGను ప్రశ్నించింది. సర్వే నెంబర్ 25లో ఉన్న ఈ భూములను పలు అవసరాలకు కేటాయిస్తూ వచ్చారని న్యాయస్థానానికి తెలిపారు.
ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం రేపటి వరకు ఆ భూముల్లో పనులు ఆపాలని ఆదేశిస్తూ, పిటిషన్పై విచారణను వాయిదా వేసింది.