కర్ణాటక (Karnataka) లో భారీగా మాదకద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు. డ్రగ్స్ (Drugs) అక్రమరవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు విదేశీ మహిళలను అరెస్టు చేశారు. బెంగుళూరు విమానాశ్రయంలో వీరి నుంచి రూ.75 కోట్ల విలువైన 37 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మహిళలను నైజీరియాకు చెందిన బాంబా ఫాంటా (31), అబిగైల్ అడోనిస్ (30)గా గుర్తించారు.
డిల్లీ నుంచి ఎండీఎంఏను ట్రాలీ బ్యాగుల్లో తరలిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు మంగుళూరు పోలీస్ కమీషనర్ అనుపమ్ అగర్వాల్ మీడియాకు వెల్లడించారు. అలాగే వీరి నుంచి మొబైల్ ఫోన్లు, పాస్ పోర్టులతో పాటు రూ.18వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.
వీరిద్దరూ డిల్లీలో నివాసం ఉంటూ దేశవ్యాప్తంగా డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. విమానాల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ ను పలుప్రాంతాలకు రవాణా చేస్తున్నారని, ఏడాది కాలంలో ముంబయికి 37 సార్లు, బెంగుళూరుకు 22సార్లు విమాన ప్రయాణాలు చేసినట్లు పోలీసులు వివరించారు. 2020లో ఫాంటా అనే మహిళ బిజినెస్ వీసాపై భారత్ కు రాగా, 2016 నుంచే అడోనిస్ భారత్ లో ఉంటున్నట్లు తెలిపారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ డ్రగ్స్ ముఠాలో భాగస్వాములయ్యారని అగర్వాల్ తెలిపారు.