హైదరాబాద్లోని భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్న విషయం తెలిసిందే. నగర శివారు ప్రాంతాల్లో కన్నా భాగ్యనగరం లోపలి ప్రాంతాల్లో భూముల ధరలు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ఆ మధ్యకాలంలో ఎకరం భూమి ధర ఏకంగా రూ.100 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మళ్లీ ఇప్పుడు తాజాగా కేపీహెచ్బీలో నిర్వహించిన వేలంలో రికార్డు ధరలు నమోదయ్యాయి. ఈ వేలంలో సుమారు రూ.150 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ వేలాన్ని బుధవారం పశ్చిమ డివిజన్ హౌసింగ్ బోర్డు అధికారులు నిర్వహించారు.
18 ఇళ్ల స్థలాలకు నిర్వహించిన వేలంలో 87 మంది పోటీదారులు పాల్గొన్నారు. 198 గజాల నుంచి 987 గజాల విస్తీర్ణం వరకున్న స్థలాలకు వేలం నిర్వహించారు. ఈ వేలంతో రూ.150 కోట్లు రాబడి వస్తుందని అధికారులు అంచనా వేయగా, మొత్తం 6,236.33 గజాలకు రూ.141.36 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ స్థాయిలో ధరలు రావడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని హౌసింగ్ బోర్డు కమిషనర్ గౌతమ్ వెల్లడించారు. అత్యధిక ధర గజం రూ.2.98 లక్షలు : కేపీహెచ్బీ-హైటెక్ సిటీ ప్రధాన రహదారికి ఆనుకొని ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇప్పుడా ఖాళీ స్థలాలనే వేలం వేశారు. దీంతో అక్కడ ఎక్కువ ధర పలికినట్లు తెలుస్తోంది. ముందుగా ఏడో ఫేజ్లోని నాలుగు వరుస స్థలాలకు వేలం నిర్వహించారు. అక్కడ కనీసం ధర రూ.1.25 లక్షలు ఉండగా గజానికి రూ.2 లక్షలకు పైగా ధర పలికింది.
అక్కడి నుంచి కాస్త ముందుకు వెళితే మలుపులోని ఎంఐజీ ప్లాట్కు అత్యధికంగా ధర పలికింది. ఇక్కడ గజానికి రూ.2.52 లక్షలు వచ్చింది. ఆ తర్వాత గజానికి కనీస ధర రూ.1.50 లక్షలతో వేలం నిర్వహించిన స్థలాలకూ అదేస్థాయిలో రికార్డుస్థాయిలో ధరలు దక్కాయి. ఈ వేలంలో అత్యధికంగా రూ.2.98 లక్షలు లభించగా, అత్యల్పంగా రూ.1.70 లక్షలు దక్కాయి. మరోవైపు కైతలాపూర్లో 36.16 విస్తీర్ణంలో ఉన్న స్థలాన్ని సైతం గజం రూ.1.14 లక్షలకు పోటీదారులు దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ కిరణ్బాబు, ఈవో విమల, ఏఈవోలు వాసు, శ్రావణి, కార్యదర్శి రాజేశం, ఏఈఈ బిందు పాల్గొన్నారు. అలాగే కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ ఎస్హెచ్వో రాజశేఖర్రెడ్డి, డీఐ రవికుమార్ బందోబస్తు చేపట్టారు. వేలాన్ని అడ్డుకునేందుకు స్థానిక బీజేపీ నేతలు రాగా వారిని పోలీసులు నిలువరించి పోలీస్ స్టేషన్కు తరలించారు.