రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా కిషన్రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారని, నిత్యం అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్కు అహంకారం ఉంటే.. కిషన్రెడ్డికి కుళ్లు ఉందని అన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించిన ముఖ్యమంత్రి రూ.879.80 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజాపాలన బహిరంగ సభలో మాట్లాడారు. రాష్ట్రానికి నిధులిచ్చి మంచి చేయాలని ప్రధాని మోదీ చూస్తున్నా..
కిషన్రెడ్డి అడ్డుపడుతున్నారని తెలిపారు. తాము కేంద్ర మంత్రుల వద్దకు, ప్రధాన మంత్రి వద్దకు పలుమార్లు వెళ్లి ఏదైనా సాధిస్తే.. కిషన్రెడ్డి తానే తెచ్చానంటూ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. వస్తే తన ఖాతాలోకి, రాకపోతే రేవంత్రెడ్డి ఏమీ చేయడంలేదని ఆరోపించడం ఆయనకు అలవాటుగా మారిందన్నారు. ‘‘నేను కష్టపడి మామునూరు ఎయిర్పోర్టుకు అనుమతులు తెస్తే తానే తెచ్చానని కిషన్రెడ్డి చెప్పుకుంటున్నారు. అలా అయితే మూసీ ప్రక్షాళనకు, మెట్రో విస్తరణకు, ఆర్ఆర్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాల పనులకు, పాలమూరు-రంగారెడ్డికి నీటి కేటాయింపులు, కాళేశ్వరానికి కేటాయింపులు, సమ్మక్క-పారక్క, సీతారామ సాగర్లకు నిధులు రాకుండా అడ్డుపడుతున్నది ఆయనేనని భావించాల్సి వస్తుంది’’ అని రేవంత్ అన్నారు. తాను కిషన్రెడ్డి ఒక సందర్భంలో కలిసి పనిచేశామని, ఆయన కంటే చిన్నవాడిని, జూనియర్ను అయిన తాను ఎదగడం ఓర్వలేక అసూయతో రగిలిపోతున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం చేస్తున్న, చేసిన పనులను బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మనఃసాక్షితో చూడాలని సీఎం రేవంత్ అన్నారు. 25.50 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, కేసీఆర్ ఎగవేసిన రైతుబంధు సాయం రూ.7,627 కోట్లు ఇచ్చామని, కోతలు లేకుండా విద్యుత్తు అందిస్తున్నామని చెప్పారు. అలాగే 50 లక్షల మందికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని వివరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎస్సీ సబ్ప్లాన్, బీసీ కార్పొరేషన్, ట్రైబల్ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్లను పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ కార్పొరేషన్ల కింద స్వయం ఉపాధి పథకాలకు రూ.6 వేల కోట్లు అందజేస్తామని చెప్పారు.