తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కేటీఆర్ (కే.టీ. రామారావు) కు బ్రిటన్ నుండి మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. 2025 మే 30న లండన్లో జరగనున్న ‘ఐడియాస్ ఫర్ ఇండియా’ (Ideas for India) కాన్ఫరెన్స్లో కేటీఆర్ కీలక ప్రసంగం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమాన్ని బ్రిడ్జ్ ఇండియా (Bridge India) సంస్థ నిర్వహిస్తోంది. ప్రతిష్ఠాత్మక రాయల్ లాంకాస్టర్ హోటల్లో జరిగే ఈ సదస్సులో యూకే-ఇండియా వ్యాపార నాయకులు, విధాన నిర్ణేతలు, తెలుగు డయాస్పోరా సహా 900 మందికి పైగా ప్రముఖులు పాల్గొననున్నారు.
ఇది కేటీఆర్కు బ్రిటన్ నుండి వచ్చిన రెండవ ముఖ్య ఆహ్వానం. 2025 జూన్ 20-21 తేదీల్లో ఇంగ్లాండ్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జరిగే ‘ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం’ (Oxford India Forum) వార్షిక సదస్సులో కూడా కేటీఆర్ కీలక ప్రసంగం ఇవ్వనున్నారు. ఈ సదస్సు థీమ్ “భారత అభివృద్ధికి ఆధునిక సాంకేతికతలు”గా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొంటారు.
వీటితో పాటు లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రోగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ (పీడీఎస్ఎల్) యూకేలోని వార్విక్ టెక్నాలజీ ఫార్మ్లో ఏర్పాటు చేసిన తమ నూతన కేంద్రాన్ని ప్రారంభించాల్సిందిగా కేటీఆర్ను ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు మే 30న కేటీఆర్ వార్విక్ యూనివర్సిటీ సైన్స్ పార్క్లోని పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
ఇన్నోవేషన్ మరియు రీసెర్చ్ రంగాల పట్ల కేటీఆర్ వినూత్నమైన దృక్పథం, అంతర్జాతీయ స్థాయిలో భాగస్వామ్యాల స్థాపన, ఇన్నోవేషన్ ప్రోత్సాహానికి ఆయన పెట్టిన కృషి తమ సంస్థా విధానాలకు అనుగుణంగా ఉందని, ఆయన చేతుల మీదుగా తమ కేంద్రం ప్రారంభించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నామని సంస్థ డైరెక్టర్ క్రాంతి పుప్పాల పేర్కొన్నారు.
ఇంతకు ముందు కేటీఆర్కు అమెరికాలోని నార్త్వెస్టర్న్ యూనివర్సిటీ నుండి కూడా ప్రత్యేక ఆహ్వానం లభించింది. 2025 ఏప్రిల్ 19న ఇల్లినాయిస్లోని IBC 2025 కాన్ఫరెన్స్లో ముఖ్య అతిథిగా పాల్గొనాలని ఆహ్వానించారు. తెలంగాణలోని పారిశ్రామిక అభివృద్ధి, హైదరాబాద్ను ఉద్యోగ అవకాశాల కేంద్రంగా మార్చడంలో కేటీఆర్ పాత్రను ప్రశంసిస్తూ ఈ ఆహ్వానం అందించారు.