ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆధారాలు లేకున్నా రాద్ధాంతం చేస్తున్నారంటూ టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేసినందుకు వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆయనకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. హామీలు అమలు చేయడం చేతగాకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ధ్వజమెత్తారు. చట్టాలను గౌరవించే వ్యక్తులుగా కాంగ్రెస్ సర్కారు పెట్టిన అక్రమ కేసుల్లోనూ విచారణకు హాజరై సహకరిస్తున్నామని గుర్తుచేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలను తప్పుదారి పట్టించేందుకే ఫోన్ట్యాపింగ్ పేరిట నాటకాలడుతున్నారని విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు అబద్ధాలు ఆడటంలో పోటీపడుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని నడిపించే సత్తా వారికి లేదని, అందుకే ఇలాంటి దుర్మార్గాలకు దిగుతున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీలను గాలికొదిలి ఇలాంటి దిక్కుమాలిన చర్యలకు దిగుతున్నదని ఆక్షేపించారు. ఇలాంటి తప్పుడు వ్యవహారాలను ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నేతలకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడితే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని చెప్పారు. రాజకీయ పబ్బం కోసం పచ్చి అబద్ధాలు చెప్తున్న పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ను కోర్టుకు ఈడుస్తామని తేల్చిచెప్పారు.