మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించడంలో పోలీసుల పాత్ర ఎనలేనిదంటూ ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కొనియాడారు. 45 రోజులపాటు సాగిన వేడుకల్లో కోట్లాది మంది భక్తులను నియంత్రించడంలో భద్రత సిబ్బంది క్రమశిక్షణగా వ్యవహరించారంటూ ఓ కార్యక్రమంలో ప్రశంసించారు. ఈ క్రమంలోనే కుంభమేళాలో విధులు నిర్వహించిన దాదాపు 75వేల మంది పోలీసులకు రూ 10 వేల చొప్పున ప్రత్యేక బోనస్ ప్రకటించారు. సిబ్బంది సేవలకు గుర్తింపుగా ‘మహాకుంభ్ సేవా మెడల్ ప్రదానం చేస్తామని తెలిపారు. అదేవిధంగా దశలవారీగా వారం రోజుల సెలవులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా పోలీసు సిబ్బందితో కలిసి భోజనం చేశారు.
మౌని అమావాస్య సమయంలో భక్తులను సమర్థంగా
నియంత్రించడం, అగ్ని ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో ప్రాణనష్టం జరగకుండా వేగంగా స్పందించడం వంటి అంశాల్లో భద్రత సిబ్బంది సమష్టి కృషిని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. “మహా కుంభమేళా కేవలం విశ్వాసాలకు సంబంధించిన కార్యక్రమం మాత్రమే కాదు. ఆర్థిక అంశాలూ ముడిపడి ఉన్నాయి. ప్రయాగ్ రాజ్ లో మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7500 కోట్లు ఖర్చు చేసింది. దీనికి ప్రతిగా ఆర్థిక వ్యవస్థకు రూ.3.5 లక్షల కోట్లు వచ్చి చేరాయి. కుంభమేళాలో పాల్గొన్న వారు మాత్రమే కార్యక్రమం స్థాయిని అర్థం చేసుకోగలరు. ఎక్కడో కూర్చొని ప్రతికూల వ్యాఖ్యలు చేయడం సులభం” అని యూపీ సీఎం వ్యాఖ్యానించారు.