పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కస్బా (Kasba) పరిసరాల్లో ఓ న్యాయ విద్యార్థిని (Law Student)పై సామూహిక అత్యాచారం జరిగింది. బుధవారం రాత్రి 7:30 నుంచి 8:50 గంటల మధ్య కాలేజ్ క్యాంపస్ (Law College In Kolkata)లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకూ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన వారిలో ఇద్దరు విద్యార్థులు కాగా, మరో వ్యక్తి కళాశాల సిబ్బందిగా పేర్కొన్నారు. ఈ ఘటనపై కోల్కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇది చాలా తీవ్రమైన సంఘటన అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం తనకు అందలేదని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ మేరకు రాష్ట్రంలోని మమతా బెనర్జీ నేతృతంలోని తృణమూల్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులకు భద్రత కరవైందని ధ్వజమెత్తింది.
కాగా, 2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా ఆర్జీకార్ దవాఖాన డాక్టర్లు, వైద్య విద్యార్థులు సుదీర్ఘకాలం ఆందోళనలు నిర్వహించారు. ఘటన అనంతరం ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్ను ఆగస్టు 10న కోల్కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును సీబీఐ విచారించింది. ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్ పేరును ఛార్జ్షీట్లో చేర్చి కోర్టుకు సమర్పించింది. దీనిపై విచారణ జరిపిన కోల్కతాలోని సీల్దా కోర్టు.. సంజయ్ రాయ్ని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు దోషికి జీవితఖైదు విధించింది. ఈ ఘటన మరవకముందే ఇప్పుడు మరో విద్యార్థినిపై అత్యచారం ఘటన వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది.