ఈ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వెలువడుతుందని, కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. సోమవారం నిర్వహించే మంత్రివర్గ సమవేశంలో చర్చించిన తర్వాత ఎన్నికల తేదీపై స్పష్టం వస్తుందని చెప్పారు. కూసుమంచిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ, కూసుమంచి మండలం, తిరుమలాయపాలెం మండలం, నేలకొండపల్లి మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
రిజర్వేషన్లకు అనుగుణంగా గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులనే ఎంపిక చేస్తామని తెలిపారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించామన్నారు. వారం రోజుల్లో అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకోని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వరకు రైతు భరోసా, సన్నాలకు రైతు బోనస్ వారి వారి బ్యాంకు ఖాతాలలో జమ చేస్తామని వెల్లడించారు. నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ వస్తుందని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నేతలదేనని చెప్పారు. ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయించుకోవడమే కాదు.. వాటి నిర్మాణం పూర్తి చేయించే బాధ్యత కూడా నాయకులే చూసుకోవాలన్నారు.