విశాఖపట్టణంలో లులూ గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో షాపింగ్ మాల్ నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించేందుకు AP ప్రభుత్వం అనుమతిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. లులూ సంస్థ సమర్పించిన ప్రతిపాదనలను సమీక్షించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏపీఐఐసీకి (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) అప్పగించింది.
ఈ క్రమంలో, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (VMRDA) పరిధిలోని 13.43 ఎకరాల హార్బర్ పార్కు భూమిని ఏపీఐఐసీ కి బదిలీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ స్థలంలో లులూ సంస్థ చిల్డ్రన్స్ ఎమ్యూజ్మెంట్ పార్క్, ఫుడ్కోర్టు, 8 స్క్రీన్లతో కూడిన ఐమ్యాక్స్ మల్టీప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది.
హార్బర్ పార్కు భూమిని మాల్ నిర్మాణానికి కేటాయింపు:
2014 నుండి 2019 మధ్య, అప్పటి ప్రభుత్వంతో లులూ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది, దీనిలో భాగంగా విశాఖ బీచ్ రోడ్డులోని హార్బర్ పార్కు భూమిని మాల్ నిర్మాణానికి కేటాయించారు. అయితే 2023లో గత ప్రభుత్వం ఈ భూమిని రద్దు చేయడంతో, లులూ సంస్థ పెట్టుబడి ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. తాజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సంస్థతో తిరిగి సంప్రదింపులు జరిపింది, తద్వారా లులూ మరోసారి పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది.
ఈ నెల 13న నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక సమావేశంలో లులూ సంస్థ ప్రతిపాదనలకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
- లులూ సంస్థ కోరిన మినహాయింపులు:
షాపింగ్ మాల్ కోసం భూమిని 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన కేటాయించాలి. మూడేళ్లు లేదా షాపింగ్ మాల్ ప్రారంభించే తేదీ వరకూ (ఏది ముందైతే) అద్దె మినహాయింపు ఇవ్వాలి. ప్రతి 10 ఏళ్లకోసారి అద్దెను 10% పెంచే విధానం అనుసరించాలి.