ఇంట్లో కూరగాయల మొక్కలతో పాటు గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన సంఘటన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ నరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 26వ తేదీన శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఊటుపల్లి గ్రామంలోని డైమండ్ ఎస్టేట్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కూరగాయల మొక్కలతోపాటు గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం తెలుసుకున్న ఎస్సై వెంటనే ఆ విషయాన్ని శంషాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డికి సమాచారం అందించాడు. నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఊటుపల్లి గ్రామ పరిధిలోని డైమండ్ ఎస్టేట్ కాలనీకి చేరుకొని పరిశీలించగా ఇంటి పక్కన 45-50 సంవత్సరాల వయస్సు గల ఒక వ్యక్తి అక్రమంగా, రహస్యంగా గంజాయి మొక్కలను, కూరగాయల మొక్కలతో పాటు సాగు చేస్తున్నట్లు గుర్తించారు.
ఇంట్లో ఉన్న వ్యక్తులు బయటకు రావాలని కోరగా తార్కేశ్వర్ సింగ్ (49) అనే వ్యక్తితో పాటు అతని భార్య బిమల్ సింగ్, కుమారుడు బంటీ సింగ్, కుమార్తె రూపాలి సింగ్లు వచ్చారు. ఆ ఇల్లు అతని భార్య బిమల్ సింగ్ పేరు మీద ఉంది. తారకేశ్వర్ సింగ్ను అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరుపగా గత కొంతకాలం క్రితం బీహార్ రాష్ట్రం నుంచి శంషాబాద్కు వలస వచ్చిన అతని కుటుంబం శంషాబాద్ పట్టణంలోని కోమటి బస్తీలో నివాసం ఉన్నారు. వారి ఆధార్ వివరాలు సైతం ఇక్కడి నుంచే ఉన్నాయి. నిందితుడు బీహార్ రాష్ట్రం దర్బంగా జిల్లా, సిసో గ్రామానికి చెందినవాడిగా వెల్లడించాడు. కూలీ పని చేస్తు చాలా సంవత్సరాల నుండి ఖైనీ, గుట్కా, జర్దా తినడం అలవాటు ఉంది. ఏడాది క్రితం శంషాబాద్లోని మధురా నగర్లోని స్ట్రీట్ నంబర్ 5 వద్ద సాయిబాబా హోటల్ పేరుతో ఒక కర్రీ పాయింట్ను ప్రారంభించాడు. అక్కడ పని చేస్తూనే 8 నెలల క్రితం అతను తన కుటుంబ సభ్యులతో కలిసి కోటేశ్వర్రావు అనే వ్యక్తి నుండి ఇంటి నంబర్ 2-48/2, డైమండ్ ఎస్టేట్ కాలనీ, ఊట్పల్లి గ్రామంలో కొనుగోలు చేసి ఇక్కడికి వచ్చారు.
బయటకు కొనకుండా తన ఇంట్లోనే మొక్కలు పెంచుకోవాలని నిర్ణయించుకొని గంజాయి మొక్కలను పెంచుతూ వాటి ఆకులను తింటూ మత్తులోకి జారుకుంటున్నట్లు తెలిపారు. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.