నారాయణపూర్ జిల్లా అబుజ్మాఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ అనంతరం మృతుల మృతదేహాలను వెంటనే కుటుంబాలకు అప్పగించాలని సామాజిక కార్యకర్తలు, మానవహక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో కూడిన కలెక్టివ్ సమితి “Coordination Committee for Peace (CCP)” ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కోరింది.
“ప్రతినితి ప్రొఫెసర్ జి. హరగోపాల్, ప్రొఫెసర్ జి. లక్ష్మణ్, డా. ఎమ్.ఎఫ్. గోపీనాథ్, కవితా శ్రీవాస్తవ, క్రాంతి చైతన్య, మీనా కందసామి సంయుక్తంగా ఇచ్చిన ప్రకటనలో ఇలా పేర్కొన్నారు:
“హైకోర్టు ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, మృతదేహాలను తక్షణమే విడుదల చేసి కుటుంబాలకు అప్పగించాలి. మృతదేహాల పరిరక్షణలో ఆలస్యం వల్ల అవి పాడవుతుండగా, కుటుంబాలకు వారి ప్రియమైనవారికి గౌరవంగా వీడ్కోలు చెప్పే అవకాశాన్ని కోల్పోతున్నారు. భారత రాజ్యాంగ విలువలకు, మానవతా దృక్కోణానికి అనుగుణంగా, మృతదేహాలను అకుండితంగా విడుదల చేయాలని, న్యాయ సూచనలను పాటించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.”
మే 24, 2025న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు ఛత్తీస్గఢ్ అడ్వకేట్ జనరల్ ఇచ్చిన హామీ ప్రకారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబాలకు అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటికీ మృతదేహాలు జారీ కాలేదని, కుటుంబాలు చాలా దూరం ప్రయాణించి వచ్చినా, వారి ప్రియమైనవారి శరీరాలను చూడలేక మానసికంగా తల్లడిల్లుతున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇటీవల భద్రతా బలగాలు 27 మంది మావోయిస్టులను హతమార్చాయి. అందులో సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు కూడా ఉన్నాడు.
అయితే ప్రభుత్వ వర్గాల ప్రకారం, బసవరాజు మృతదేహాన్ని విడుదల చేస్తే, ఆయనకు ప్రజలు ‘వీరుడిగా’ అంత్యక్రియలు నిర్వహించే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా.
భద్రతా అధికారుల ప్రకారం: “పోలీసుల ఆధ్వర్యంలో ఒక నిర్దిష్ట, గోప్యమైన ప్రదేశంలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరిపేలా చేసుకోవచ్చు. ఇలా చేస్తే సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.”
CCP ప్రకటనలో ఇంకొన్ని కీలక అంశాలు ఇలా ఉన్నాయి:
• “శరీరాలను కోల్డ్ స్టోరేజిలో ఉంచకుండా పాడయ్యేలా వదిలేసినట్టు వచ్చిన ఆరోపణలు అత్యంత భయంకరమైనవి. ఇది మానవ హక్కుల, వైద్య నైతిక నియమాల ఉల్లంఘన. మృతులపై ఈ విధమైన అనాగరిక వైఖరి అసహ్యకరమైన దుర్వినియోగం.”
• “కోర్టులో కేంద్ర ప్రభుత్వ తరపున హాజరైన డిప్యూటీ సోలిసిటర్ జనరల్ కనీసం రెండు మృతదేహాలను విడుదల చేయకూడదని ప్రతిపాదించడమే కాదు, అంత్యక్రియలు ‘చట్టాన్ని ఉల్లంఘించగలవు’ అన్న కారణంతో బాధిత కుటుంబాల విషాదాన్ని క్రిమినలైజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధం. కోర్టు ముందు కుటుంబాలు శాంతియుతంగా అంత్యక్రియలు నిర్వహిస్తామని హామీ ఇచ్చినా, మృతదేహాలు ఇవ్వకపోవడం తీవ్రంగా ఖండించదగిన విషయం.”
• “బాధిత కుటుంబాలకు సహాయపడుతున్న అంబులెన్స్ డ్రైవర్లు, ఇతరులపై కూడా ప్రభుత్వం బెదిరింపులు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట.”
• “ఇది కేవలం పరిపాలన పరమైన జాప్యం కాదు— ఇది భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు)లో మరణానంతర గౌరవం కూడా భాగమే అని పలు సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేశాయి.”
• “ప్రతి మనిషికి మరణానంతరం గౌరవం అవసరం. మృతదేహాలను విడుదల చేయకుండా అడ్డుకోవడం చట్టపరంగా ప్రశ్నార్థకమే కాదు, నైతికంగా ఖండించతగినది కూడా” అని CCP ప్రకటించింది.