మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లాలో అటవీ శాఖ అధికారులు, పోలీసులు ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తరతరాలుగా పోడు చేసుకుంటున్న వారిని అరెస్టులు, కేసులతో బెదిరించి గూడేలను ఖాళీ చేయించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆదివాసీ బిడ్డగా, మాజీ నక్సలైట్గా ప్రాచుర్యం పొందిన మంత్రి సీతక సొంత నియోజకవర్గంలో ఈవిధంగా జరగడం సిగ్గుచేటు, అవమానకరమని పేర్కొన్నది. ఈ మేర కు తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట గురువారం ఒక లేఖను విడుదల చేశారు. ‘రేవంత్రెడ్డి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న ధనసరి అనసూయ ఎందుకు ఆదివాసీల గురించి మాట్లాడటంలేదు? రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్, కాంగ్రెస్ ప్రభుత్వాలు 1996లో తెచ్చిన పెసా చట్టం, 2006లో తెచ్చిన ఎఫ్ఆర్ఏతోపాటు 1/70 చట్టం గురించి సీతక మరచిపోయిందా?’ రాహుల్గాంధీ ఆదివాసీల గురించి, రాజ్యాంగం గురించి పదేపదే మాట్లాడుతుంటే.. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు అర్థం కావడం లేదా? అని ఆ లేఖలో ప్రశ్నించారు.
ఆదివాసీ ప్రజల హకుల కోసం జల్, జంగల్, జమీన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన కుమ్రంభీం పేరుతో ఏర్పాటైన జిల్లాలోని సుమారు 339 గ్రామాలను, ప్రజలను ఖాళీ చేయించాలని తెచ్చిన జీవో-49ని రద్దుచేయాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. ఈ జీవో ఉద్దేశం జంతువుల పరిరక్షణ కాదని, మోదీ, అమిత్షా మానసపుత్రులైన అదానీ, అంబానీ, కార్పొరేట్ సంస్థల కోసమనేనని విమర్శించారు. అటవీ సంపదను కొల్లగొట్టడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఆ జీవోతో కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలు తెలంగాణ చిత్రపటంలో కనపడవని కమిటీ అభిప్రాయపడింది.
జంతు సంరక్షణ, పర్యావరణం పేర్లతో ఆదివాసీలను అడవి నుంచి వెల్లగొట్టడానికి పోలీ స్ బలగాలతో చిత్రహింసలకు గురిచేస్తూ చంపుతున్నారని మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కారిడార్ పేరుతో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల్లోని సిర్పూర్ యూ, వాంకిడి, జైనూర్, కెరమెరి, ఆసిఫాబాద్, రెబ్బన, కాగజ్నగర్, నార్నూర్, సిర్పూర్ (టీ), చింతల మానపల్లి, గాజగూడ, బెజ్జూర్, లింగాపూర్, పెంచికల్పేట తదితర మండలాల ప్రజలను ఖాళీ చేయించేందుకు తెస్తున్న ఒత్తిడిని విరమించుకోవాలని హెచ్చరించింది.
ఇప్పటికే కవ్వాల్ టైగర్ రిజర్వ్ జోన్ పేరుతో ఆదివాసీలను అడవికి దూరం చేసిన పాలకులు.. వారి బతుకులను రోడ్డుపాలు చేశారని విమర్శించింది. ప్రభుత్వం వెంటనే ఫీల్డ్ సర్వే చేసి పోడు వ్యవసాయం చేస్తున్నవారికి పట్టాలు ఇచ్చి, భూమాతలో నమోదు చేసి, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేసింది. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ప్రకారం అభివృద్ధిని కోరుకుంటున్నారని అందుకు అందరం ఆదివాసీల హకుల అమలు కోసం వారికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు.