ఏపీలోని అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మధ్యాహ్నం సమయంలో భారీ పేలుడు సంభవించింది. అధిక పేలుడు సామర్థ్యం కలిగిన మందుగుండు పదార్థాలు మంటల్లో చిక్కుకుపోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు.. భారీ మంటలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. పేలుడు ధాటికి నిర్మాణం ఒక్కసారిగా కూలిపోయింది. ఏం జరిగిందో వెంటనే తెలియక స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాద ధాటికి 8 మంది మృతి చెందారని సమాచారం. కానీ మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. బాధితుల్లో ఎక్కువమంది తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందినవారు. గాయపడిన వారిని విశాఖ కెజిహెచ్ కి తరలించారు.
ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నాయి. మంటలను అతి కష్టంగా అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వేసవి కావడంతో అధిక ఉష్ణోగ్రతలతో మందుగుండు తయారీ కేంద్రంలో ప్రమాదం సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ఈ ఘటన పట్ల సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను హోంమంత్రి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ను సీఎం చంద్రబాబు అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ప్రమాద స్థలాన్ని హోం మంత్రి అనిత సందర్శించనున్నారు. ఆమె ఆసుపత్రిలో క్షతగాత్రులను కూడా పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా వుంటుందని మంత్రి లోకేష్ అన్నారు.
ఈ ఘటనలో మరణించిన వారి ఊకో కుటుంబానికి ప్రభుత్వం 15 లక్షల రూపాయిల పరిహారం ప్రకటించింది.