చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో ఈ రోజు ఉదయం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 17 మంది మృతిచెందారు. ఈ ఘటనలో ఎనిమిది మంది చిన్నారులు, ఐదుగురు మహిళలు సహా ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. అగ్నిమాపక శాఖ వివరాల ప్రకారం, ఉదయం 6:16 గంటలకు సమాచారం అందిన వెంటనే 11 ఫైర్ ఇంజన్లతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక పరిశీలనలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో శ్రీకృష్ణ పెరల్స్ షాప్ ఉండగా, పై అంతస్తులో నివాసాలు ఉన్నాయి. ఒకే ద్వారం, ఇరుకైన మెట్లు ఉండటం వల్ల రక్షణ, తప్పించుకోవడం కష్టమైంది.
మృతుల్లో ప్రహ్లాద్ (70), మున్ని (70), రాజేందర్ (65), సుమిత్ర (60), హమ్యే (7), అభిషేక్ (31), షీతల్ (35), ప్రియాన్ష్ (4), ఐరాజ్ (2), ఆరుషి (3), రిషభ్ (4), ప్రథమ్ (1), అనుయాన్ (3), వర్ష (35), పంకజ్ (36), రజ్జిని (32), ఇడ్డు (4) ఉన్నారు. గాయపడినవారిని ఒస్మానియా, యశోద, డీఆర్డీఓ, అపోలో ఆస్పత్రులకు తరలించారు. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ. 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ, చికిత్స చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఇతర నాయకులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, సహాయక చర్యలను పరిశీలించారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీ కంప్రెసర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో పాతబస్తీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రమాదం కారణంగా పాతబస్తీలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. చార్మినార్ వెళ్లే రహదారులను మూసివేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడకు ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల హైదరాబాద్లో అగ్నిప్రమాద ఘటనలు ఎక్కువగా జరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
పాతబస్తీలో చోటు చేసుకున్న ఈ అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీస్, ఫైర్ విభాగం చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించి సరైన వైద్య సాయం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని సీఎం వారికి భరోసా ఇచ్చారు. ఘటనా స్థలానికి మంత్రి పొన్నం చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.