“మాటలే దేశద్రోహమైతే” పుస్తకానికి ముందుమాట…
‘ఆజాదీ ఓన్లీ వే..’ ఎన్నిసార్లయినా అనాల్సిన మాట. విముక్తిని సాధించేదాకా అనితీరవలసిన మాట. ప్రజలకే ఆ శక్తి ఉంటుంది. ప్రజా కాంక్షలను పలికేవాళ్లకే అది సాధ్యమవుతుంది. ఒక్క కశ్మీర్ కోసమే కాదు. పాలస్తీనా కోసం. దండకారణ్యం కోసం. యావత్ మానవాళి కోసం. కాలం అట్లా కోరుకుంటోంది మరి. తనకు గొంతు ఇవ్వగల వ్యక్తులు కావాలని. సమూహాలు కావాలని.
బహుశా అవతలి వాళ్లూ తేల్చుకున్నారు. ఇక మనమూ తేల్చుకోవాల్సిందే. మనమిప్పుడు అరుంధతీ రాయ్ కి సంఘీభావం ప్రకటిస్తే సరిపోదు. షౌకత్ హుస్సేన్ కు మద్దతు ఇస్తే సరిపోదు. వాళ్లలాగా, వాళ్లతోపాటు పని చేసి జైళ్ళల్లో మగ్గుతున్న రాజకీయ ఖైదీల్లాగా అమరులైన వాళ్ళ సహచరులలాగా ఆజాదీ ఓన్లీ వే అనగలమా? విముక్తి గురించి మాట్లాడగలమా? సకల బంధనాలు తెగిపడిన భవిష్యత్ స్వేచ్ఛా లోకాన్ని రచించగలమా? ఇంతకన్నా పరీక్షా కాలం లేనేలేదని ఎవరికి వాళ్ళం రుజువు కాగలమా?
ఇప్పుడు మన ముందు ఎన్ని ప్రశ్నలు? ఎన్ని సమాధానాలు? ఎన్ని ఉత్తేజాలు? ఎన్ని పోరాట అవకాశాలు? బుద్ధిజీవులు ఎలా ఉండాలో వాళ్ళు మరోసారి తేల్చేశారు. రచయితలు నిలబడాల్సిన చోటును చూపించారు. ప్రజా కార్యకర్తలకు అవసరమైన సూటి భాషను అందించారు. అందుకే ఇది నిరాశామయ కాలం కాదు. ఆశలు వెల్లివిరుస్తున్న కాలం. నిజానికి ఫాసిస్టులకే ఏ ఆశా కనిపించడం లేదు. అన్ని వైపులా జనం చుట్టుముడుతున్నారు. లోపలికి తోసే కొద్దీ బైటపడుతున్నారు. అబద్ధాలు, వంచనలు, కుట్రలు, అణచివేతలు, దురహంకారాల ఇనుప గోడల కింది నుంచి మొలుచుకొని వస్తున్నారు. ప్రజలంటేనే ఫాసిస్టులకు భయం. లేకపోతే ఈ ఎన్నికల చావుదెబ్బ తర్వాత వారానికే అరుంధతీ రాయ్, ప్రొ. షౌకత్ హుస్సేన్ మీద కేసును తవ్వితీయగలరా? సరిగ్గా పదేళ్ల కిందటి అభియోగం మీద అరెస్టుకు రంగం సిద్ధం చేయగలరా? ఇది దుర్మార్గమే కాదు. ఇక కూలిపోక తప్పదని తెలిసినప్పటి బరితెగింపు.
బాల రాముడూ కాపాడలేడని తేలిపోయింది. అయోధ్య ఉన్న ఫైజాబాదు నియోజక వర్గంలో ఫాసిస్టు కూటమి ఓడిపోయింది. 370ని రద్దు చేసినా కశ్మీర్ ఆజాదీ చల్లారదని స్పష్టమైంది. కశ్మీర్ లోయలో బీజేపీ కనీసం పోటీ చేయడానికి కూడా అడుగు పెట్టలేకపోయింది. ఎన్నికల రాజకీయాల బైటే కాదు. ఎన్నికల్లో కూడా జనం ఎదురెక్కి వస్తారని ఫాసిస్టులు ఊహించి ఉండకపోవచ్చు. ఊహించినా జనం మధ్య విద్వేషాలు లేవదీస్తే అంతా చక్కబడుతుందని అనుకొని ఉండొచ్చు. కానీ ప్రజలంటే మహత్తరమైన సామూహిక వ్యక్తీకరణ. చీల్చేకొద్దీ మరింతగా కలుస్తారు. దొరికిన ప్రతి రాయినీ అందుకుంటారు. ఇప్పటికి ఇది ఫాసిస్టులకు ఎదురుదెబ్బ. సమాజమంతా అట్టుడికి పోతున్నదనడానికి గుర్తు. ఫాసిజాన్ని అన్ని తావుల నుంచి పెకలించి వేయగలమని ప్రజలు చేస్తున్న హెచ్చరిక. ఏకంగా ప్రజల మనసుల మీదే శాశ్వతంగా పెత్తనం చేయాలనుకొనే వాళ్లు దీన్ని సహించగలరా? అందుకే దేశం మీద, ప్రజల మీద ఫాసిస్టులకు ప్రతీకారేచ్ఛ పెరిగింది. మతం నుంచి మానవ జీవితానికి ఆజాదీ కావాలన్న వాళ్ల మీద ఆగ్రహం కలిగింది. భారత్ నుంచి కశ్మీర్ కు ఆజాదీ కావాలన్నవాళ్ళ మీద ద్వేషం రగిలింది. ఒక సభ దేశద్రోహమైంది. ఉపన్యాసం రాజ్యానికి సవాలైంది. ఇట్లాంటి స్థితిని గతంలో చాలా ప్రభుత్వాలు ఎదుర్కొన్నాయి. కానీ ఇది ఫాసిస్టు ప్రభుత్వం. అటూ ఇటూ ఎవ్వరూ తేలిగ్గా తీసుకోరు. ఒక మాట ఎంత శక్తివంతమో, ఒక పాట ఎంత ప్రభావశీలమో, ఒక ఆలోచన ఎలాంటి భౌతిక రూపం తీసుకుంటుందో ఫాసిస్టులకు అందరికన్నా బాగా తెలుసు. ఫాసిస్టు సందర్భంలో ఏ మాట ఆయుధమవుతుందో ప్రజలకూ తెలుసు. అట్లని ఇది కేవలం మాటల యుద్ధం కాదు. మాటల వల్లనే వచ్చిన చిక్కు కాదు. మాటలతో తీరేదీ కాదు. వెనుక ఈ దేశాన్నంతా ఆర్ఎస్ఎస్ శాఖగా మార్చాలనే ప్రణాళిక ఉంది. యావద్దేశాన్ని అధాని సామ్రాజ్యపు పెరడుగా కుదించాలనే ప్రయత్నం ఉంది. దీని కోసం బస్తర్లో, కశ్మీర్లో, ఇంకా అలాంటి అనేక చోట్ల లక్షల సైనిక బలగాలు. దేశమంతా హిందుత్వ ఉన్మాద సేనలు. అంతటా కార్పొరేటీకరణ, సైనికీకరణ, హిందుత్వీకరణ.
వీటిని 2010 నాటి ఢిల్లీ సభలో మాట్లాడిన అరుంధతీ రాయ్, షౌకత్ హుస్సేన్, ఎస్ఆర్ గిలానీ, సయ్యదలీ గిలానీ, వరవరరావు తదితర వక్తలు, శ్రోతలు, నిర్వాహకులు ఎవ్వరూ అంగీకరించరు. వీటన్నిటి నుంచి స్వేచ్ఛను కోరుకున్నారు. విముక్తి కావాలన్నారు. ఆనాటి నుంచి, అంతక ముందు నుంచి, వాళ్లేగాక కోటానుకోట్ల మంది ప్రజాస్వామ్యం కావాలంటున్నారు. ఫాసిజానికి ప్రజాస్వామ్యమంటే పడదు. కానీ ప్రజలు ఉనికిలో ఉండటమంటేనే ప్రజాస్వామ్యం కోరుకోవడం. వందల వేల చరిత్ర అదే నిరూపించింది. అందుకే ఫాసిస్టులకు ప్రజలంటే భయం. చాలా ముందుగానే వాళ్ల అంబులపొదిలో భారతీయ న్యాయ సంహిత సిద్ధమైంది. మనం ఇంతకాలం యుఎపిఏ గురించే ఆందోళనపడుతున్నాం. ఇప్పుడు శిక్షాస్మృతే దాన్ని దాటిపోయింది.
ఇదిగో ఇలాంటి కాలంలో ఈ కవిత్వం అచ్చవుతున్నది. ఒకసారి ఈ కాసిన్ని కవితల్లోని నిర్మాణ వ్యూహాన్ని చూడండి. సరిగ్గా ఇప్పుడు అవసరమైన పద్ధతి కనిపిస్తుంది. కవిత్వానికి ఏ పరదాలు వేయకుండా, విన్యాసాలకు పోకుండా శక్తివంతమైన, ఆర్ద్రమైన, ఆగ్రహమైన, సుతిమెత్తనైన కవిత్వం ఎలా రాయాలో ఫాసిస్టు సందర్భం ఎన్నడో తేల్చేసింది. దానికి ఈ కవితలు ఉదాహరణ. అరవై ఏళ్ల పరిపక్వ కవి స్వరం నుంచి, నవ యువ కంఠధ్వని దాకా ఈ పుస్తకం మనకు వినిపిస్తుంది. ఇందులో కవిత్వానికి అరుంధతీ రాయ్ ఇతివృత్తం మాత్రమే. కానీ ప్రతి కవితా ఇవాల్టి మన ప్రజల ఉద్యమాల్లోకి విస్తరించింది. ప్రజల పోరాట మానసికతలోకి వెళ్లి అచ్చమైన కవిత్వమైంది.
సరిగ్గా పదేళ్ల కిందట కశ్మీర్ సందర్భంలోని ‘ఆజాదీ ఓన్లీ వే’ అనే మాట ఈ సంఘీభావ కవిత్వానికి ఏకైక అంతరార్థంగా మారింది. ప్రజలు, కవులు, బుద్ధిజీవులు ఆజాదీ తప్ప ఇంకేం మాట్లాడగలరు? స్వేచ్ఛ, విముక్తి, ఆత్మగౌరవం తప్ప ఇంకేం కోరుకోగలరు? ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధ చట్టాలు వచ్చినా, ఎంత నెత్తురూ కన్నీరూ కారినా మళ్లీ మళ్లీ అనవలసిన మాట ‘ఆజాదీ ఓన్లీ వే..’ అనే కదా.
– పాణి