లక్నో: తాను బతికున్నంత కాలం పార్టీలో తన రాజకీయ వారసుడంటూ ఎవరూ ఉండబోరని బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్న ఆమె.. తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ‘ఎక్స్’ వేదిగా వెల్లడించారు. పార్టీకి సంబంధించి అన్ని కీలక పదవుల నుంచి అతడిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన ఒక రోజులోపే బీఎస్పీ అధినేత్రి ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం.
అంతకు ముందురోజు ఇదే విషయంపై మాయావతి మాట్లాడుతూ.. తనకు పార్టీయే ముఖ్యమని, ఆ తర్వాతే కుటుంబమని స్పష్టం చేశారు. పార్టీ విధానాలకు హాని కలిగించేలా తన పేరును ఎవరైనా దుర్వినియోగం చేస్తే వెంటనే తొలగిస్తానన్నారు. బీఎస్పీని రెండు వర్గాలుగా చీల్చి, బలహీనపరిచే ప్రయత్నం చేసిన ఆకాశ్ మామ అశోక్ సిద్దార్ధ్ ను ఈ నియమానికి అనుగుణంగానే గత నెల పార్టీ నుంచి బహిష్కరించామన్నారు.. ఇప్పుడు మేనల్లుడు ఆకాశ్ పైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తన సోదరుడు ఆనంద్ కుమార్ మాత్రం పార్టీ నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయలేదన్న ఆమె.. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆనంద్ కుమార్ తో పాటు రాజ్యసభ సభ్యుడు రామా గౌతమ్ ను బీఎస్పీ జాతీయ సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.