సామాజిక సమీకరణల నేపథ్యంలో కేబినెట్లో చోటును కోల్పోయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర పోస్ట్ చేశారు. తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన వారికి ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తనకు రాజకీయాలంటే పదవులు, అధికారాలు కాదని ప్రజలకు సేవ చేయడమేనని చెప్పుకొచ్చారు. తాను మంత్రిగా లేకపోయినా ప్రజల సమస్యలు వినడంలో, వారి గొంతుకను ప్రభుత్వం వరకు తీసుకెళ్లడంలో ముందుంటానన్నారు. తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదని పోస్ట్లో రాసుకొచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని కీలకమైన నేతల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఉన్నారు. వీరిలో ఇప్పటికే ఒకరు మంత్రి వర్గంలో ఉండగా మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఈయన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు ఉన్న పలుకుబడి, ప్రజాదరణతో ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఇచ్చిన బాధ్యతలను విజయవంతం చేసిన ఆయన మంత్రి పదవిపై అనేక ఆశలు పెట్టుకున్నారు. కానీ సామాజిక సమీకరణల నేపథ్యంలో ఇటీవల జరిగిన కేబినెట్ విస్తరణలో ఆయనకు చోటు దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. దీంతో పార్టీ పెద్దలు ఆయన ఇంటికి వెళ్లి బుజ్జగించారు.
అయితే, సామాజిక సమీకరణల నేపథ్యంలో కేబినెట్లో చోటును కోల్పోయిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర పోస్ట్ చేశారు. తెలంగాణ కేబినెట్లో నూతనంగా నియమితులైన వారికి ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో వారికి సంపూర్ణ విజయం చేకూరాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తనకు రాజకీయాలు అంటే పదవులు గానీ, అధికారాలు గానీ కాదని.. ప్రజల పట్ల తన నిబద్ధత, తెలంగాణ పునర్నిర్మాణం పట్ల తన కలలే తనకు ప్రేరణగా నిలిచాయని అన్నారు. అదే కారణంగా తాను తిరిగి కాంగ్రెస్ పార్టీకి వచ్చానని రాసుకొచ్చారు.