నల్లగొండ: నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు, రెండు కార్లు, కంటైనర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున చిట్యాల సమీపంలోని పెద్దకాపర్తి వద్ద ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనక వస్తున్న కారు.. బస్సును ఢీకొట్టింది. దానివెనుక వెస్తున్న కంటైనర్.. కారును ఢీకొట్టడంతో అది బస్సు కిందికి దూసుకెళ్లింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరోకారు అదుపుతప్పి డివైడర్ను గుద్దింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బస్సు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది. ప్రమాదం వల్ల హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.