ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DOPT) తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ నియామకాన్ని DOPT ఆమోదించింది. 2014 సివిల్ సర్వీసెస్ బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారెన్ సర్వీస్ (IFS) అధికారిణి నిధి తివారీ ఇప్పటివరకు పలు హోదాల్లో సేవలు అందించారు. ప్రస్తుతం, ప్రధాన మంత్రి కార్యాలయంలో (PMO) డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న నిధి తివారీ 2022 నవంబర్ నుండి ఆ హోదాలో ఉన్నారు.
అంతకుముందు, విదేశాంగ మంత్రిత్వ శాఖలో, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో అండర్ సెక్రటరీగా నిధి తివారీ సేవలు అందించారు. ఈ క్రమంలోనే, ఆమెను ప్రధాన మంత్రి మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నియమించారు. 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షలో నిధి తివారీ 96వ ర్యాంక్ సాధించారు. నిధి తివారీ స్వస్థలం ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లాకు చెందిన మెహముర్గంజ్.
ఇప్పటివరకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇద్దరు ప్రైవేట్ సెక్రటరీలు ఉన్నారు, అయితే మూడో ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ నియమించారు. 2023 జనవరి 6 నుండి PMOలో నిధి తివారీ డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. PMOలో చేరడానికి ముందు, నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వ శాఖలో పనిచేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో సేవలు అందించారు. భారత్కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే PMOలో కీలకపాత్ర పోషించే స్థాయికి ఆమెను తీసుకెళ్లిందని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది.