ఇజ్రాయెల్, హమాస్ ఘర్షణల కారణంగా.. గాజాలో సామాన్యుల పరిస్థితి గాలిలో దీపంగా మారింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఇప్పటికే వేలాది మంది చిన్నారులు మరణించారు. కాగా, తాజాగా మరోసారి గాజాపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది చిన్నారులు మరణించారు. శనివారం గాజాలోని ఖాన్ యూనిస్పై ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది పిల్లల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు వాళ్ల తండ్రి వైద్యుడు హమ్ది అల్ నజ్జర్ తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతున్నాడు. ఈ ఘటన స్థానికులను కన్నీటి పర్యంతం చేస్తోంది.
అయితే ఈ దాడిలో ప్రాణాలతో బయటపడిన వైద్యుడు హమ్ది అల్ నజ్జర్తోపాటు ఆయన కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో నజ్జర్ను దక్షిణ గాజాలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నజ్జర్ ఆరోగ్యంపై ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యుడు అజీజ్ అల్ ఫార్రా స్పందించారు. నజ్జర్కు పొత్తి కడుపుతోపాటు ఛాతి భాగంలో రక్త స్రావం జరిగిందన్నారు. దాంతో ఆయనకు ఆపరేషన్ నిర్వహించినట్లు చెప్పారు. అలాగే అతని తలకు సైతం గాయాలయ్యాయని వెల్లడించారు. ఆ భగవంతుడే అతడిని రక్షిస్తాడని ఈ సందర్భంగా వైద్యులు ఫార్రా ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక గాయాలపాలైన అతడి కుమారుడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నా.. ప్రస్తుతానికి స్థిరంగా ఉందని గాజాలోని వైద్య ఉన్నతాధికారులు తెలిపారు. ఈ దాడిలో మృతి చెందిన చిన్నారుల వయస్సు ఒకటి నుంచి 12 సంవత్సరాల మధ్య ఉంటుందని వివరించారు.
ఈ దాడి జరిగిన సమయంలో నజ్జర్ భార్య అలా.. అక్కడ లేరని చెప్పారు. గత 20 మాసాలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడి జరుగుతోందని గుర్తు చేశారు. ఈ దాడుల్లో గాయపడిన వారికి అలా చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆమె చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలోనే నజ్జర్తోపాటు వారి కుమారుడికి సైతం వైద్య చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. మరోవైపు.. వైమానిక దాడి జరిగిన అనంతరం ఆమె ఇంటికి వెళ్లి చూడగా.. ఆమె భర్తతోపాటు చిన్నారులు రక్తపు మడుగులో పడి ఉన్నారని నజ్జర్ సమీప బంధువులు తెలిపారు.