నోయిడా దంపతులపై అంతర్జాతీయ సైబర్ సెక్స్ రాకెట్: ఈడీ రూ.15.66 కోట్లు స్వాధీనం
గత ఐదేళ్లుగా భార్యభర్తలు ఇద్దరూ ఈ దందా నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే, వీరికి అంతర్జాతీయంగా సంబంధాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ జంట నోయిడా ఇంటిపై దాడి చేసి రూ.15.66 కోట్ల అక్రమ విదేశీ నిధుల్ని Enforcement Directorate (ED) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నోయిడాలో ఉజ్వర్ కిషోర్, అతడి భార్య నీలు శ్రీవాస్తవ గత ఐదేళ్లుగా వ్యభిచార రాకెట్ దందా నడుపుతున్నారు. సైప్రస్ దేశానికి చెందిన టెక్నియస్ లిమిటెడ్ అనే సంస్థతో ఈ జంటకు సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ సంస్థ ఎక్స్ హామ్హర్, స్ట్రిప్టాట్ వంటి అడల్ట్ ఎంటర్ టైన్ మెంట్ వెబ్సైట్లను నిర్వహిస్తోంది.
నోయిడా కు చెందిన ఈ దంపతులు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్, ముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా మోడల్స్ ని నియమించికుంటున్నారని అధికారులు తెలిపారు. మంచి జీతాలు ఇస్తామనే హామీలతో మోడలింగ్ అవకాశాలు అందిస్తామని “ఎచాటో డాట్ కామ్” అనే పేజీని క్రియేట్ చేశారన్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన అనేక మంది మహిళలు ఈ ప్రకటనల ద్వారా వీరి వలలో చిక్కినట్లు చెప్పుకొచ్చారు. ఆడిషన్ల కోసం నోయిడాలోని ఆ జంట ఫ్లాట్ కు వచ్చిన తర్వాత వీరిని ఆ దందాలోకి లాగారన్నారు. నెలకు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జీతాన్ని ఇచ్చినట్లు గుర్తించారు. అధికారులు దాడి చేసిన సమయంలో ఈ జంట ఉంటున్న ఫ్లాట్లో ఒక ప్రొఫెషనల్ వెబ్ క్యామ్ స్టూడియోని ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. అడల్ట్ కంటెంట్ ఆన్లైన్ స్ట్రీమింగ్ చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయన్నారు. వినియోగదారులు చేసే చెల్లింపుల ఆధారంగా మోడల్స్ టాస్క్లను చేసేవారని తెలిపారు. ఈ సేవలను ఉపయోగించడానికి వినియోగదారులు టోకెన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. కేటగిరీని బట్టి ఛార్జీలు మారుతూ ఉంటాయని ఆదాయంలో 75 శాతం దంపతులు ఉంచుకోగా, 25 శాతం మాత్రమే మోడల్కు ఇచ్చేవారన్నారు. కాగా, ప్రారంభంలో వినియోగదారుల నుండి క్రిప్టోకరెన్సీల ద్వారా చెల్లింపులు స్వీకరించేవారని చెప్పుకొచ్చారు. టెక్నియస్ లిమిటెడ్ ద్వారా రూ.7 కోట్లు ట్రాన్స్ఫర్ చేసిన నెదర్లాండ్ లోని ఒక బ్యాంక్ అకౌంట్ ని ED గుర్తించింది. ఈ నిధులను భారతదేశంలో ఇంటర్నేషనల్ డెబిట్ కార్డులు ఉపయోగించి విత్ డ్రా చేసుకున్నారు. ఈ రాకెట్లో వేలాది మంది మహిళలు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.