గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ అనేవి దేశంలో వందల మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. డబ్బు ఆశచూపి ఉన్నదంతా ఊడ్చడమే కాకుండా అప్పులు చేసి ప్రాణాలు తీసుకునేలా చేస్తోంది. బెట్టింగ్, గేమింగ్ ఊబిలో చిక్కుకుని యువత అప్పులపాలై బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పార్లమెంటులోనూ ఈ బెట్టింగ్, గేమింగ్ అంశాలపై ప్రశ్నకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానం ఇచ్చారు.
తమిళనాడుకు చెందిన DMK MP దయానిధి మారన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, గేమింగ్ వంటి వాటిపై లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రప్రభుత్వం తరపున అశ్వినీ వైష్ణవ్ బదులిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ను నిషేధించిందని పేర్కొన్న దయానిధి మారన్, ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవడంలో కేంద్రప్రభుత్వం తన నైతిక బాధ్యత నుంచి తప్పించుకుంటుందా అని ఘాటుగా ప్రశ్నించారు. వీటన్నిటిపై నిషేధం విధించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎంత సమయం కావాలని నిలదీశారు.
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వంటివి రాష్ట్రాల పరిధిలోని అంశాలని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వీటిపై రాష్ట్రాలు చట్టాలు చేయవచ్చని బుధవారం కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. బెట్టింగ్, గేమింగ్ కట్టడి కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. ఇందులో కేంద్రప్రభుత్వ నైతికతను ప్రశ్నించే హక్కులేదని తేల్చి చెప్పారు. ఇలాంటి అంశాలపై చట్టాలు చేసుకునేందుకు రాష్ట్రాలకు రాజ్యాంగం నైతిక, చట్టబద్ధ అధికారాలను ఇచ్చిందని గుర్తుచేశారు. ఇవి రాష్ట్రాల పరిధిలోని అంశాలే, అయినా కేంద్ర ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఇప్పటివరకు 1410 గేమింగ్ సైట్లను నిషేధించినట్లు చెప్పారు.
ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై ఇటీవల కేంద్రం కొరడా ఝళిపించింది. కేంద్ర ఆర్థికశాఖ పరిధిలోని DGGI వందల వెబ్సైట్లను బ్లాక్ చేసింది. 2400 బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేసి రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది. గేమింగ్ ప్లాట్ఫామ్ల పట్ల అప్రమత్తం ఉండాలని వాటిని ఎవరూ వాడొద్దని DGGI హెచ్చరించింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఈ ఆన్లైన్ గేమింగ్ ప్రచారం చేస్తున్నారని గుర్తించిన కేంద్రం ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచించింది.