తన కార్ ని చల్లగా ఉంచడం కోసమని సెజల్ షా అనే అహ్మదాబాద్ మహిళ కార్ బాడీ మొత్తానికి ఆవుపేడ పులిమేశారు. ఆవుపేడ కారుకి గట్టిగా పట్టుకొని వుండటం కోసం ఆమె ఆవుపేడని ఎర్రమన్నుతో కలిపి మిశ్రమం తయారుచేసి కారుకి పూశారు.
తాను ఇప్పటికే ఇంటి ఫ్లోరింగ్ కి ఆవుపేడ వాడుతున్నానని, అది సత్ఫలితం ఇచ్చినందున తన కారుకి ఎందుకు వాడకూడదన్న ఆలోచన వచ్చిందని, ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని అమలుచేశానని ఆమె అన్నారు. కారుకి ఆవు పేడ రాయడం కూడా సత్ఫలితం ఇచ్చిందని ఆమె అంటున్నారు. కారు బైట ఉష్ణోగ్రత 43 సెల్సియస్ డిగ్రీలుండగా, కారు లోపల 37 సెల్సియస్ డిగ్రీలుందని ఆమె అన్నారు. ఆవుపేడ వాడకం వల్ల తాను కారులో ఏసి వాడటం ఆపేశానని ఆమె చెప్పారు. ఆవుపేడ వాడకం వల్ల ఎలాంటి పర్యావరణ హాని జరగదని, పైగా అది పర్యావరణ హితమని ఆవిడ చెబుతున్నారు.
కానీ ఆవుపేడ పులిమినంత మాత్రాన చల్లదనం పెరుగుతుందా అనేది సందేహమే. ఇంతవరకు సైంటిఫిగ్గా ఇది సరైన అవగాహనేనని అనడానికి ఎలాంటి ఋజువులు లేవు. ఆవుపేడ పూయకపోయినా కారు బైట 43 డిగ్రీలు వున్నప్పుడు కారు లోపల 37 డిగ్రీలు వుంటుంది. ఎందుకంటే ఓపెన్ ఎండలో వున్న ప్రాంతంకంటే నీడ వున్న ప్రాంతంలో ఉష్ణోగ్రత తక్కువగా వుంటుంది. ఇది సహజం.
కారుని ఏసి కేవలం చల్లగా వుంచడమొక్కటే చేయదు. సాధారణంగా మనం ఏసి వేసినప్పుడు కార్ కిటికీలు మూసేయడం జరుగుతుంది. బైటనున్న వాతావరణ, వాయు, ధ్వని కాలుష్యం, ప్రత్యక్షంగా ఎండ వేడి నుండి మనల్ని మనం రక్షించుకోవడమే కాక ప్రయాణం చేసినంతసేపూ ప్రశాంతంగా, ఫ్రెష్ గా వుంటాం. కానీ కారు నడిపేటప్పుడు సెజల్ షా కారు కిటికీలు తెరిచే ప్రయాణం చేస్తున్నారు. అలా కిటికీలు తెరిచి ప్రయాణం చేస్తే ఖచ్చితంగా వేడి గాలులు సోకి శరీరం డిహైడ్రేట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా వుంటాయి. అది ఏ మాత్రమూ ఆరోగ్యానికి మంచిది కాదు.
భారతీయ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కొన్ని సహజ, సంప్రదాయ ఆరోగ్య, వాతావరణ పరిరక్షణ విధానాలు ఎప్పటినుండో ఆచరణలో వున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని అశాస్త్రీయమైన, వింతైన పోకడలు మొదలయ్యాయి. గోశాలల్లో ఆవులకి శీతాకాలంలో ఆవుల నిద్రా సమయంలో ఉన్ని రగ్గులు కప్పాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, గోశాలలకి వందలాదిగా రగ్గులు సరఫరా చేసింది. అలాగే దోమల నుండి ఆవుల రక్షణకోసం మస్కిటో కాయిల్స్ కూడా వాడారు. శీతకాలంలో చలి, దోమలు ఇప్పడు కొత్తగా వచ్చినవి కావు. అనాది కాలం నుండీ ఉన్నవే. ఆవుల దళసరి చర్మం ద్వారా అన్నింటినీ తట్టుకోగలవని మనం గ్రహించాలి.
కారుకి ఆవుపేడ పులమటం వంటి విచిత్ర విడ్డూర పోకడల ద్వారా, నవ్వులపాలు కావటం మినహా మరే ఇతర ప్రయోజనం లేదు. ఇంకా నయం ఆవుపేడ పూస్కోవడం ద్వారా శరీరాన్ని వేడి నుండి రక్షించుకోవచ్చని ఇంకా ఎవరూ అనలేదు..!


