ఇంగ్లండ్లో 800 మందికి పైగా న్యాయవాదులు, జడ్జీలు, విద్యావేత్తలు.. బ్రిటన్ ప్రధాని Keir Starmer కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో వారు ఇజ్రాయెల్పై, ప్రత్యేకించి ఆ దేశ నాయకులపై, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినందుకు ఆంక్షలు విధించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. గాజాలో పాలస్తీనియన్లపై జరుగుతున్న మారణహోమాన్ని ఆపడం, శిక్షించడంలో బ్రిటన్ తన చట్టపరమైన బాధ్యతను నెరవేర్చాలంటూ లేఖలో పేర్కొన్నారు.
వీరి అభిప్రాయం ప్రకారం, గాజాలో నరమేధం జరుగుతోంది. అంతేకాదు, ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలు, అంతర్జాతీయ మానవీయ చట్టాల ఉల్లంఘన జరుగుతున్నాయని పేర్కొన్నారు.
2024 జూలైలో అంతర్జాతీయ న్యాయస్థానం (ICJ) ఇచ్చిన తీర్పు ప్రకారం, ఇజ్రాయెల్ ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో పాలస్తీనా ప్రజల స్వయంపాలన హక్కును కాలరాయడం అంటే ఇది అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నదని తీర్పులో పేర్కొన్నారు.
లేఖలో, ఇజ్రాయెల్ “Operation Gideon’s Chariots” మే 2025 సైనిక ప్రణాళికపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇది గాజా పట్టణం మీద పూర్ణ సైనికాధిపత్యాన్ని సాధించడమే లక్ష్యంగా ఉందని, ఈ కార్యాచరణ 2025 మే 16న ప్రారంభమైంది. ఈ ప్రణాళికలో గాజా ప్రజలను దక్షిణ దిశగా బలవంతంగా తరలించడం, అక్కడి మౌలిక సదుపాయాలను నాశనం చేయడం ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి Netanyahu చేసిన వ్యాఖ్యల ప్రకారం, గాజాను పూర్తిగా ధ్వంసం చేసి, అక్కడి ప్రజలు తిరిగి వెళ్లలేని పరిస్థితిని సృష్టించాలనే ఉద్దేశం ఉందని స్పష్టమవుతోంది. ఇది ఒక శాశ్వత జనాభా మార్పును కలిగించే విధంగా ఉంది, ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని 2025 మే 16న ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషనర్ అన్నారు. ఇది “జాతి నిర్మూలన” గా పరిగణించవచ్చు అని హెచ్చరించారు.
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు కనీసం 54,056 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా, 1,23,129 మంది గాయపడ్డారు. మరొక ప్రకటన ప్రకారం 61,700 మందికి పైగా మరణించారు. వేలాది మంది ఇళ్ల శిథిలాల్లో కనపడకుండాపోయారు.
UK ప్రభుత్వం ఇటీవల ఇజ్రాయెల్తో చేపట్టిన వాణిజ్య ఒప్పంద చర్చలను నిలిపివేసింది. యూకేలో ప్రజల ఆందోళనలు, నిరసనలు ఉధృతంగా మారాయి.
గాజాలో ప్రస్తుత పరిస్థితిని UNOCHA (United Nations Office for the Coordination of Humanitarian Affairs) “దయ లేకుండా సాగుతున్న యుద్ధం”గా వర్ణించింది. మే 2025లో వచ్చిన నివేదిక ప్రకారం, మొత్తం గాజా జనాభా తీవ్రమైన ఆహార కొరతతో బాధపడుతోంది. అందులోనూ సుమారు 5 లక్షల మంది ప్రజలు ఆకలి చావులు రుచి చూస్తున్నారు.
లేఖలో న్యాయ నిపుణులు పేర్కొన్నది ఏమిటంటే, యూకే అంతర్జాతీయ న్యాయానికి, jus cogens నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఇది కేవలం రాజకీయ లేదా నైతిక బాధ్యత కాదు, చట్టబద్ధమైన కర్తవ్యం కూడా. యూకే ఇప్పటివరకు చేసిన చర్యలు ఈ ప్రమాణాలకు తగ్గట్టుగా లేవని వారు వ్యాఖ్యానించారు.
లేఖ ముగింపు భాగంలో, “ఇప్పుడు చర్యలు తీసుకోకపోతే గాజాలోని పాలస్తీనా ప్రజల నిర్మూలనకు మనం సాక్షులమవుతాం” అని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇది ఒక మానవతా విషయంలో తక్షణ చర్యలు అవసరమని వారు కోరారు.