తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని, సింధూ జలాల ఒప్పందం నిలిపివేతని సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ పాకిస్తాన్ బుధవారం నాడు భారత్ కు ఒక లేఖ రాసింది. ఈ లేఖలో, పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరతను ప్రస్తావిస్తూ, భారత్ నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరింది. ఈ మేరకు పాకిస్తాన్ జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ ఆలి ముర్తుజా భారత జల శక్తి మంత్రిత్వ కార్యదర్శికి లేఖ రాశారు.
పహాల్గమ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్ లో నీటి సమస్య మొదలైంది. ఈ ఏడాది మొత్తం ఖరీఫ్ పంటపై ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ భారత్ కు లేఖ రాసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన సిందూర్ పై జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “తీవ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు” అంటూ ఉగ్రవాదంపై భారత్ వైఖరి స్పష్టం చేశారు.