భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW) నూతన చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ శనివారం నియమితులయ్యారు. ప్రస్తుతం రా చీఫ్గా ఉన్న రవి సిన్హా జూన్ 30న పదవీ విరమణ పొందిన వెంటనే ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. ‘రా’లో రెండో అత్యంత సీనియర్ అధికారి కావడంతో పరాగ్ జైన్కు ఈ కీలక అవకాశం లభించింది. జులై 1 నుంచి ఆయన రెండేళ్ల పాటు ఈ ముఖ్య బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈనేపథ్యంలో పరాగ్ కెరీర్ ప్రస్థానంపై ఓ లుక్ వేద్దాం.
పరాగ్ జైన్ పంజాబ్ క్యాడర్కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన రాలోని ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ARC) విభాగానికి సారథ్యం వహిస్తున్నారు. ఈ విభాగం దేశ గగనతల నిఘాకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంది. భారతదేశ ఇంటెలీజెన్స్ వర్గాలు పరాగ్ను సూపర్ గూఢచారి అని పిలుస్తుంటాయి. హ్యూమన్ ఇంటెలీజెన్స్, టెక్నికల్ ఇంటెలీజెన్స్లను ఎంతో నైపుణ్యంతో వినియోగించుకోవడంలో ఆయన దిట్ట అని చెబుతుంటారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండటం ఎలాగో పరాగ్ను చూసి నేర్చుకోవాలని ఇంటెలీజెన్స్ వర్గాలు అంటున్నాయి. చండీగఢ్లో ఎస్ఎస్పీ హోదాలో, లూధియానాలో డీఐజీగా పరాగ్ వ్యవహరించారు. భటిండా, మన్సా, హోషియార్పూర్ జిల్లాల్లోనూ వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆయా చోట్ల ఉగ్రవాద కార్యకలాపాలపై ఆయన ఉక్కుపాదం మోపారు. 2021 జనవరి 1న పరాగ్కు పంజాబ్ డీజీపీగా పదోన్నతి లభించింది.
కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత, ఆపరేషన్ బాలాకోట్ నిర్వహించినప్పుడు రా తరఫున జమ్మూకశ్మీరులో పరాగ్ విధులు నిర్వర్తించారు. కెనడా, శ్రీలంకలలో పలు మిషన్లను ఆయన విజయవంతం చేశారు. భారత్కు పదేపదే హెచ్చరికలు చేసిన ఖలిస్తానీ ఉగ్రవాదుల వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని కెనడాలో రా తరఫున ప్రత్యేక మిషన్ను పరాగ్ అమలుపరిచారు. భారత్లోని ఇరుగుపొరుగు దేశాలపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. ఆయా ప్రాంతాల్లో స్వయంగా పనిచేసిన ప్రత్యక్ష అనుభవం ఉంది. అందుకే పరాగ్ను రా సెక్రెటరీ పదవికి ప్రధాని మోదీ శనివారం (జూన్ 28న) ఎంపిక చేశారని అధికార వర్గాలు తెలిపాయి.
ఆపరేషన్ సిందూర్ వేళ పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీరు (పీఓకే)లోని ఉగ్ర స్థావరాలు, సైనిక సదుపాయాలపై భారత్ అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది. ఇందుకు అవసరమైన కీలక సమాచారాన్ని సేకరించి, భారత సేనలకు అందించింది మరెవరో కాదు. పరాగ్ జైన్. కొన్నేళ్ల శ్రమతో ఆ సమాచారాన్ని సేకరించి ఆయన సిద్ధంగా ఉంచారు. పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్గా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను నియమించిన ప్రస్తుత తరుణంలో, భారత రా సారథిగా ఇంటెలీజెన్స్ నిష్ణాతుడైన పరాగ్ బాధ్యతలు చేపట్టనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జమ్మూకశ్మీర్ ప్రాంతంలో పాక్ ఉగ్రవాద పన్నాగాలకు చెక్ పెట్టేందుకు ఆయన సుదీర్ఘ అనుభవం భారత్కు దోహదపడనుంది.