భారత్లో అత్యంత చవకైన ఆహార పదార్థంగా, ప్రతి ఇంట పిల్లలు, పెద్దలు అంత్యంత ఇష్టంగా తినే పార్లే జీ బిస్కెట్లు యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజాలో ఖరీదైన సరుకుగా మారిపోయాయి. మన దేశంలో 5 రూపాయలకు దొరికే బిస్కెట్ ప్యాకెట్ ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరిన గాజాలో 500 రెట్లు ఎక్కువగా రూ. 2,400కి పెరిగి అది కూడా అత్యంత కష్టంగా లభ్యమవుతున్నది. గాజా నుంచి వైరల్ అయిన ఓ తాజా సోషల్ మీడియా పోస్టులో ఓ వ్యక్తి తన కుమార్తెకు అత్యంత ఇష్టమైన పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ను 24 యూరోలకు పైగా(రూ. 2,342) చెల్లించి కొన్నానని తెలిపాడు
‘చాలా సేపు ఎదురుచూసిన తర్వాత మొత్తమ్మీద ఈరోజు రవీఫ్కి ఇష్టమైన బిస్కెట్లు దొరికాయి. మామూలుగా 1.5 యూరోలకు అమ్మే బిస్కెట్లు 24 యూరోలకు పెరిగిపోయినప్పటికీ రవీఫ్ ఇష్టాన్ని కాదనలేకపోయాను’ అంటూ మొహమ్మద్ జవాద్ అనే వ్యక్తి పెట్టిన పోస్టు వైరల్ అయింది. 2023 అక్టోబర్లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత క్రమంగా గాజాలో ఆహారం అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఏడాది మార్చి నుంచి మే 19 మధ్య కాలంలో పాలస్తీనాను ఇజ్రాయెల్ దిగ్బంధించడంతో అంతర్జాతీయ ఒత్తిడి మేరకు అత్యంత పరిమితంగా మానవతా సాయానికి సంబంధించిన ట్రక్కులను మాత్రమే గాజాలోకి అనుమతించింది.
మానవతా సాయాన్ని రాజకీయ, ఉగ్రవాద గ్రూపు హమాస్ అడ్డుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అయితే మే 27న గాజా హుమానిటేరియన్ ఫౌండేషన్(జీహెచ్ఎఫ్) సహాయం పంపిణీ కోసం సెక్యూర్ డిస్ట్రిబ్యూషన్ సైట్ అనే మోడల్ని ప్రవేశపెట్టింది. ఇది అమెరికా, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్ సంయుక్త మద్దతుతో ఏర్పాటు చేసిన మోడల్. రఫాలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో పాలస్తీనా పౌరులకు సరకులు అందచేస్తారు. ఇక్కడ లభించే సాయం కన్నా వెలుపల బ్లాక్ మార్కెట్కు తరలిపోయేదే అధికమన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఒక్క పార్లే జీ బిస్కెట్లు మాత్రమే కాదు అన్ని వస్తువుల ధరలు దాదాపు 500 రెట్లకు పైగా అధిక ధరతో బ్లాక్ మార్కెట్లో అమ్ముడు పోతున్నాయి. ఉత్తర గాజాలో జూన్ 6న బ్లాక్ మార్కెట్లో లభిస్తున్న వస్తువుల ధరలు ఈ ప్రకారం ఉన్నాయి. కిలో చక్కెర: రూ. 4,914, కిలో వంట నూనె రూ. 4177, కిలో ఆలుగడ్డ రూ.1965, కిలో ఉల్లిగడ్డ రూ.4,423 కప్పు కాఫీ రూ. 1,800