పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి అనేక అనుమానాలకు దారి తీస్తున్నది. 2025 మార్చి 24న జరిగిన ఒక ఘటనలో ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు వార్తలు వెలువడ్డాయి. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ విజయవాడ నుండి రాజమండ్రికి Royal Enfield మోటార్ సైకిల్ TS08FT0739 మీద వెళుతుండగా ఈ సంఘటన రాజమండ్రి సమీపంలోని కొంతమూరు హైవే ప్రాంతంలో చోటు చేసుకుంది.
అయితే పాస్టర్ ప్రవీణ్ ప్రమాదంలో మరణించలేదని, ఆయనది హత్య అని అనేకమంది పాస్టర్లు ఆరోపిస్తున్నారు. సంఘటన జరగటానికి కొద్ది నిమిషాలముందు ప్రవీణ్ మోటార్ సైకిల్ మీద రోడ్ కింద బాటలోకి దిగి మెల్లగా నడిపిస్తున్న సిసి కెమెరా విజువల్ పోలీసులు విడుదల చేశారు. ఆ విజువల్ ప్రకారం మోటార్ సైకిల్ హెడ్ లైట్ పనిచేయడం లేదు. రైట్ సైడ్ ఇండికేటర్ లైట్ వేసుకొని ఆయన బండిని మెల్లగా నడిపిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకునే వున్నారు. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం ఆయనది హిట్ అండ్ రన్ కేస్ కావచ్చు లేదా బండి స్కిడ్ అయి రోడ్ దిగువున పడినప్పుడు ఆయన తలకి గాయాలై ప్రాణాలు పోయి వుండొచ్చు.
అయితే ఆయన బాడీని, మోటార్ సైకిల్ ని చూసిన క్రైస్తవ సంఘాలవారు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోటార్ సైకిల్ వెనక భాగంలో చిన్న డామేజ్ మాత్రమే వుంది. ఎవరో వెనుక నుండి బండిని గుద్ది వుండొచ్చని, ఆయన కింద పడ్డప్పుడు దాడిచేసి వుండొచ్చని, ప్రమాదంగా చిత్రించడానికి రోడ్డు పక్కన కిందకి తోసేసారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మోటార్ సైకిల్ టైర్ కి, సీట్ కి, మడ్ గార్డ్ కి రక్తపు మరకలు ఎలా అంటాయని వారు ప్రశ్నిస్తున్నారు. హెల్మెట్ ధరించినప్పటికీ హెల్మెట్ లోపల తల వెనుక భాగం వైపు రక్తంతో తడిసిపోయిందని, ఆయన ముఖం మీద తీవ్ర గాయాలున్నాయని, అది ఎవరో దాడి చేసినప్పుడు తగిలినట్లున్నాయని పాస్టర్లు ఆరోపిస్తున్నారు. పోలీసులు చెబుతున్నట్లు బండి స్కిడ్ అయి మట్టి బాట మీదుగా కిందకి జర్రున జారిపోతే మరి టైర్ల ముద్రలుండాలి కదా అని వారు అనుమానిస్తున్నారు. బండిని మామూలుగా నిలబెట్టి వుండటం కూడా అనుమానాలకు తావిస్తున్నదని వారంటున్నారు. ఆయన పెదవులు కట్ అయి వున్నాయని, ఒక బుగ్గ పక్కకి తిరిగిపోయి వున్నదని, ఆయన మిగతా శరీరం మీద ఎక్కడా గాయాల్లేవని, బండికి కూడా పెద్దగా ఏమీ కాలేదని, ఒక ప్రమాదంలో ఇలా జరగదని వారంటున్నారు. ఇది ఖచ్చితంగా హత్యేనని, ప్రవీణ్ మరణంపై సమగ్ర విచారణ జరపాలని కె.ఎ.పాల్, పాస్టర్ రాజా, పాస్టర్ బెన్ హర్ తదితరులు AP రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కాగా సంఘటనా స్థలాన్ని పరిశీలీంచిన పోలీసులు ప్రవీణ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పోస్ట్ మార్టం వద్దని, బాడీని ఇస్తే తీసుకెళ్లిపోతామని ఫ్యామిలీ మెంబర్స్ అంటుండగా, దళిత క్రైస్తవ సంఘాలు మాత్రం పోస్ట్ మార్టం జరపాల్సిందేనని అంటున్నాయి. ప్రభుత్వాసుపత్రి వద్ద క్రైస్తవ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. అక్కడ ప్రవీణ్ భౌతిక కాయాన్ని హోసన్న మినిస్ట్రీ నిర్వాహకులు జాన్ వెస్లీ, మాజీ MP హర్షకుమార్, మహాసేన రాజేష్ తదితరులు సందర్శించి నివాళి ఘటించారు. పైన వ్యక్తం చేసిన అనుమానాల నేపథ్యంలో నిష్పక్షపాతమైన విచారణ జరిపించి వాస్తవాల్ని వెలికితీయాలని వారు డిమాండ్ చేశారు. కాగా ప్రవీణ్ మృతదేహాన్ని హైదరాబాద్ కి తరలించి క్రైస్తవులు, అంబేద్కరిస్టులు, అభిమానుల దర్శనార్ధం సికింద్రాబాద్ లోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ (క్లాక్ టవర్)లో 27 మార్చ్, 2025 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వుంచుతారు. అంత్యక్రియలు తిరుమలగిరిలోని బాప్టిస్ట్ సమాధి దొడ్డిలో సాయంత్రం 4 గంటలకు జరుగుతాయి.
పాస్టర్ ప్రవీణ్ క్రైస్తవ సమాజంలో ఎంతో ప్రముఖ వ్యక్తి. ఆయన వ్యాఖ్యలు, బోధనలు, ప్రవచనాలు ఎంతో పరిణితితో కూడుకొని వుంటాయి. దైవాన్ని విశ్వసించే క్రమంలో మతాన్ని అతిగా చూపించకూడదని అంటారు. మతంపై అభిమానం ఎక్కువైతే మనిషి ఉన్మాదిగా మారిపోతాడని అంటారు. క్రీస్తు మరణానికి కూడా మతమే కారణమని ఆయన చెబుతారు. వ్యక్తిగతంగా కూడా ఉన్నత నైతిక స్థాయిలో ఆయన జీవిస్తారనే పేరున్నది. ఇద్దరు అనాధ ఆడపిల్లల్ని తీసుకొచ్చి తన పిల్లలతో సమానంగా ఆయన చదివిస్తున్నట్లు ఒక పాస్టర్ చెప్పారు. టీవీ డిబేట్లలో అనేక సామాజికాంశాల మీద నిర్భీతిగా తన అభిప్రాయాల్ని చారిత్రికాంశాల్ని ప్రస్తావిస్తూ మేథోపరంగా వ్యక్తం చేసే ప్రవీణ్ తన ప్రాణానికి ప్రమాదమున్నదని ఫేస్బుల్ లో ఒక పోస్ట్ కూడా పెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయిలో ఒక సమగ్ర విచారణ జరిపి, పాస్టర్ ప్రవీణ్ పగడాల చావు వెనుక వున్న సత్యాన్ని వెలికితీయించాలని సాధారణ ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు.