ఈ నెల 24న రాజమండ్రి సమీపంలో కొంతమూరు వద్ద మోటార్ సైకిల్ పై వెళుతూ అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల భౌతిక కాయానికి క్రైస్తవ సంఘాల ఆందోళనలు ఉద్రిక్తతల మధ్య, కుటుంబ సభ్యుల సమక్షంలో వీడియో తీస్తుండగా పోస్ట్ మార్టం మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలై రెండున్నర గంటలపాటు జరిగింది. అనంతరం ప్రవీణ్ భౌతిక కాయాన్ని అంబులెన్సులో హైదరాబాద్ పంపటానికి పోలీసులు ప్రయత్నించగా, ప్రభుత్వ స్పందన లేకుండా హైదరాబాద్ కి భౌతికకాయాన్ని తీసుకెళ్లడాన్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. కానీ పోలీసులు ఆందోళనకారులను చెదరకొట్టి హైదరాబాద్ కి తరలించారు.
కాగా క్రైస్తవ సంఘాల ఆందోళనలకు ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవీణ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో ఆయన అన్ని కోణాల్లో సమగ్ర విచారణకి ఆదేశించారు. తానే స్వయంగా DGP హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేయిస్తామని మంత్రి నారా లోకేష్, పారదర్శక విచారణ చేయిస్తామని హోంమంత్రి అనిత కూడా ప్రకటించారు.
గత మూడు రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న క్రైస్తవ సంఘాలు, ఒక సమగ్ర విచారణకు ప్రభుత్వం నుండి సానుకూల స్పందనని రాబట్టడంలో సఫలం అయ్యాయని చెప్పక తప్పదు. దర్యాప్తులో పోస్ట్ మార్టం రిపోర్ట్ కీలకం కానున్నందున ఆ రిపోర్ట్ కోసం ఈ విషయాన్ని ఫాలో అయ్యేవారు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.