సౌదీ అరేబియా పర్యటనను ముగించుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి నేపథ్యంలో వెంటనే చర్యలు చేపట్టారు. ఢిల్లీ పాలం విమానాశ్రయంలో దిగిన కొద్ది క్షణాల్లోనే, ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, నాయకులు ప్రస్తుత గ్రౌండ్ రిపోర్టులు, కొనసాగుతున్న భద్రతా కార్యకలాపాలు, ఈ దాడి దౌత్యపరమైన పరిణామాలపై లోతైన చర్చలు జరిపారని ఆయా వర్గాలు తెలిపాయి.
ఈ సమావేశంలో, భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, బాధితులకు సహాయం అందించడం, ఈ దాడి వెనుక ఉన్నవారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి ఈ తక్షణ స్పందన దేశ ప్రజలకు భరోసాను ఇస్తోందని చెప్పవచ్చు. ఈ సమావేశం ద్వారా, భారత ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు తన సంసిద్ధతను, దృఢ నిశ్చయాన్ని కల్కి ఉందని స్పష్టం చేసింది.
ఈ ఉగ్రదాడి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని జరిగిన ఈ దాడిలో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. స్థానిక పోలీసుల కథనం ప్రకారం, ఈ దాడి ముందుగానే ప్రణాళిక ప్రకారం జరిపారని అనుమానిస్తున్నారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిపై దేశ ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. బాధితుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా పలు దేశాలు ఈ దాడిని ఖండించి, ఇండియాకు మద్దతుగా నిలిచాయి. దీంతోపాటు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. ఉగ్రవాద చర్యలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.