హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలో పోలీసుల అతి చేష్టలకి ఓ నిండు ప్రాణం బలి అయింది. షాపూర్ నగర్ కి చెందిన జోష్ బాబు వృత్తి రీత్యా కార్పెంటర్. తన సోదరుడిని కలిసేందుకు బాలనగర్ తన బైక్ AP 09 AM 6023 మీద వెళుతుండగా బాలానగర్ లో చెకింగ్ చేస్తున్న పోలీసుల్ని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఐతే అతన్ని ఆపే క్రమంలో గోపాల్ అనే పోలీస్ కానిస్టేబుల్ అతని కాలర్ పట్టుకొని గుంజినట్లు, ఆ హడావిడిలో జోష్ బాబు కింద పడిపోగా అప్పుడే అతని పక్కగా వెళుతున్న ఆర్టీసీ బస్ అతని తల మీద నుండి వెళ్లగా అతను అక్కడికక్కడే spot death అయినట్లు సమాచారం.
ఈ సంఘటన చూసి కోపోద్రిక్తులైన సాటి వాహనదారులు పోలీసుల్ని నిలదీస్తూ ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. తమ యూనిఫాం బాడ్జీల మీద పేర్లను ఆందోళనకారులు చూస్తూ పైకి చదువుతుండటంతో ట్రాఫిక్ పోలీసులు ఆ బ్యాడ్జీలను తామే స్వయంగా చింపేయటం మొదలుపెట్టారు. అలా అసలు బాధ్యుడైన కానిస్టేబుల్ గోపాల్ పేరు బైటకి వచ్చింది. స్థానికుల ఆందోళన పెరగడంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పి గుంపుని చెదరగొట్టారు. “చలాన్ల కోసం ప్రాణాలు తీస్తారా?” అంటూ ప్రజలు పోలీసులకు వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో లోకల్ చానెల్స్ తో మాట్లాడారు. సిసి కెమెరాలు వున్నప్పటికీ వాటిని పోలీసులు తారుమారు చేస్తారేమోనని అనుమానపడ్డారు
యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న జోష్ బాబు కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరి ఆందోళన చేపట్టారు. ఇది పోలీసులు చేసిన హత్యేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని తమ్ముడు మాట్లాడుతూ తన అన్నకి ఇద్దరు చిన్న పిల్లలున్నారని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆధుకోవాలని, బాధ్యులైన పోలీసుల్ని శిక్షించాలని డిమాండ్ చేశారు.
పోలీసులకి ప్రతి నెలా కేసులు బుక్ చేయడానికి, చలాన్లు రాయడానికి, పెనాల్టీలు వసూలు చేయడానికి డిపార్ట్మెంట్ లో పై అధికారులు కొన్ని టార్గెట్స్ ఇస్తుంటారు. ఆ టార్గెట్స్ ని చేరుకోవాలనే తాపత్రయంలో వేగంగా వెళ్లే బళ్లను ఆపే ప్రయత్నం చేయడం లాంటి అతి చేష్టలకు కింది స్థాయి పోలీసులు పాల్పడుతుంటారు. ఏది ఏమైనా జోష్ బాబు మరణం సామాన్య ప్రజల్లో ఒక తక్షణ స్పందన తీసుకొచ్చింది. పోలీసులకూ కొన్ని హద్దులుంటాయని, ప్రజల్ని నేరస్తుల్లా కాక పౌరుల్లా చూడాల్సిన బాధ్యత వుంటుందని వారికి తరుచూ శిక్షణా నిపుణులతో శిక్షణ ఇప్పించాలి. పౌరులు తప్పులు చేసినంత మాత్రాన వారిపై జులుం, భౌతిక దాడులు చేయకూడదని, చట్ట ప్రకారం కేసులు బుక్ చేయాలని, ఈ విషయంలో ఉల్లంఘనలకు పాల్పడితే శాఖాపరంగా తీవ్ర చర్యలుంటాయని వారికి పై అధికారులు అర్ధమయ్యేలా చెప్పాలి. ఎక్కడికక్కడ సిసి కెమెరాల నిఘా నేత్రం వున్నప్పుడు ఇదివరకులా బండ్లని ఆపడం, దబాయించడం చేయడం కాకుండా ‘నాన్-కాంటాక్ట్’ పద్ధతిలో కేసులు బుక్ చేసి, చలాన్లు వసూలు చేసే పద్ధతిని పోలీసులు అనుసరించాలి.