తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో (Pranay Murder Case) నల్లగొండ జిల్లా ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈరోజు (మార్చి 10, 2025) తుది తీర్పును ప్రకటించింది. కోర్టు ప్రధాన నిందితుడు సుభాష్ శర్మకు మరణశిక్షను విధించింది. మిగతా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు శిక్షను విధించింది.
ప్రణయ్ మిర్యాలగూడకు చెందిన ఓ దళిత యువకుడు. అతను తన స్నేహితురాలు అమృతను ప్రేమించాడు. 2018లో కుటుంబ సభ్యుల అంగీకారంలేకపోయినా, ప్రణయ్, అమృత ప్రేమ వివాహం చేసుకున్నారు. అమృత తండ్రి మారుతీరావు తన కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో ప్రణయ్ను హత్య చేయించాలి అని నిర్ణయించుకున్నాడు. 2018 సెప్టెంబరు 14న మిర్యాలగూడలో ప్రణయ్ను బహిరంగంగానే కత్తితో పొడిచి హత్యచేశారు. మారుతీరావు ప్రణయ్ ని హత్య చేయడానికి సుపారీ గ్యాంగ్ను ఉపయోగించాడు. ఆయన A-2గా ఉన్న సుభాష్ శర్మకు రూ. 1 కోటి సుపారీ ఇచ్చి హత్యచేయించాడు. సుభాష్ శర్మతో పాటు మరికొందరు నిందితులు ఈ కుట్రలో భాగమయ్యారు.
ఈ కేసులో ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదు మేరకు 302, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు, ఆర్మ్స్ యాక్ట్ సెక్షన్ల కింద 8 మంది నిందితులపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ జరిగింది. మొత్తం 1,600 పేజీల చార్జిషీట్ను 2019లో దాఖలు చేశారు. ప్రధాన నిందితులుగా మారుతీరావు, సుభాష్ శర్మ, అస్గర్ అలీ, అబ్దుల్లా బారి, ఎంఏ కరీం, శ్రవణ్ కుమార్, శివ, నిజాంలను గుర్తించారు. ఈ కేసు విచారణలో ఉండగానే 2020 మార్చిలో మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో 5 సంవత్సరాల 9 నెలల పాటు ఈ కేసు విచారణ జరిగింది. వివిధ కోణాల్లో న్యాయస్థానం పరిశీలించిన తర్వాత తుదితీర్పును వెలువరించింది. A-2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధించగా, మిగిలిన 7 మంది నిందితులకు జీవితఖైదు విధించింది. న్యాయస్థానం ఈ తీర్పును దేశంలో పరువుహత్యలకు గట్టిగా ఎదురుగా నిలిచే చారిత్రాత్మక తీర్పుగా పేర్కొంది.