ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశాలకు దిక్కులేకుండా పోయింది. గత నెల 17న రేషన్కార్డుల జారీపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్రెడ్డి .. ‘కొత్త రేషన్కార్డుల జారీకి వెంటనే ఏర్పా ట్లు చేయండి’ అంటూ అధికారులను ఆదేశించారు. అంతేకాదు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డుల జారీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం ఆదేశాలు జారీ చేసి 15 రోజులవుతున్నా, ప్రభు త్వం ఒక్కటంటే ఒక్క కొత్త కార్డు కూడా మంజూరు చేయలేదు. ఇందుకు సంబంధించి కనీస చర్యలు కూడా చేపట్టకపోవడం గమనార్హం.
ప్రకటనలే తప్ప కార్డుల్లేవు..
కొత్త రేషన్కార్డుల జారీపై ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ప్రకటనలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేపు మాపు అంటూ సాగదీత ధోరణి అవలంబిస్తున్నదనే విమర్శలున్నాయి. నిరుడు అభయహస్తం పేరుతో దరఖాస్తులు స్వీకరించింది. వెంటనే కొత్త కార్డులు జారీ చేస్తున్నంత హడావుడి చేసింది. తాజాగా జనవరి 21 నుంచి 24 వరకు గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నది. ఆ తర్వాత జనవరి 26 నుంచి కొత్త రేషన్కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభిస్తామంటూ ప్రకటించింది. దీనిని సీఎం రేవంత్రెడ్డి అట్టహాసంగా ప్రారంభించారు. కానీ, ఎవరికీ కార్డులు రాలేదు మరో వారం రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ముగియనున్నది. ఇ ప్పుడైనా ఇస్తుందో లేక మళ్లీ వాయిదా వేస్తుందోనన్న సందేహాలున్నాయి.
పైలట్ గ్రామాల్లోనూ రాలేదు..
జనవరి 26న కాంగ్రెస్ సర్కారు రేషన్కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఎంతో అట్టహాసంగా ప్రారంభించింది. కొన్ని పైలెట్ గ్రామాలను ఎంపిక చేసిన సర్కారు.. ఆ గ్రామాల్లో నాలుగు పథకాలను అర్హులైన అందరికీ అందిస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మందికి కొత్త కార్డులు జారీ చేసేందుకు రంగంసిద్ధమైనట్టు వార్తలొచ్చాయి. కానీ ఇప్పటివరకు ఒక్క కార్డు కూడా జారీ చేయకపోవడం గమనార్హం. కనీసం పైలట్ గ్రామాల్లోని అర్హులకు కూడా ఇవ్వలేదు.