ఐపీఎల్ ట్రోఫీ కోసం 18 ఏండ్లుగా వేచి చూస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కల ఎట్టకేలకు నెరవేరింది. రెండు నెలల పాటు పదిజట్లతో సాగిన ధనాధన్ సమరంలో ఒక్కో మెట్టు అధిగమిస్తూ, ఎదురైన సవాళ్లను దాటుకుంటూ ఫైనల్ చేరిన ఆర్సీబీ.. 18వ సీజన్లో తమ టైటిల్ కలను నెరవేర్చుకుంది.
18 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్లో తొలి టైటిల్ను ముద్దాడింది. మంగళవారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్తో హోరాహోరిగా జరిగిన ఫైనల్లో ఆర్సీబీ.. ఆరు పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 191 పరుగుల ఛేదనలో పంజాబ్.. 184/7 వద్దే ఆగిపోవడంతో మొదటి టైటిల్ నెగ్గాలన్న ఆ జట్టు ఆశలు అడియాసలయ్యాయి. ఛేదనలో శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), జోష్ ఇంగ్లిస్ (23 బంతుల్లో 39, 1 ఫోర్, 4 సిక్సర్లు) పోరాడినా ఆ జట్టుకు నిరాశ తప్పలేదు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (35 బంతుల్లో 43, 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా కెప్టెన్ రజత్ పటీదార్ (16 బంతుల్లో 26, 1 ఫోర్, 2 సిక్స్ర్లు), జితేశ్ శర్మ (10 బంతుల్లో 24, 2 ఫోర్లు, 2 సిక్సర్లు), లివింగ్స్టొన్ (15 బంతుల్లో 25, 2 సిక్సర్లు) మెరుపులతో ఆ జట్టుకు పోరాడగలిగే స్కోరును అందించారు.