రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంపై కాంగ్రెస్ పాలన పిడుగుపాటుగా మారింది. లావాదేవీలు పడిపోయి ఏడాదిన్నర కాలంలోనే దివాలా తీసే పరిస్థితి దాపురించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగనంతగా రాబడి క్షీణించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం కాగ్కు సమర్పించిన నివేదికను పరిశీలిస్తే ఈ విషయం అర్థం అవుతున్నది. గతేడాది రూ.18228 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా.. కేవలం రూ.8473 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. అనుకున్నదాంట్లో 46.48% ఆదాయం మాత్రమే సాధించగలిగింది.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏటా ఖజానాకు ప్రత్యక్షంగా దాదాపు 10 శాతం, పరోక్షంగా మరింత ఆదాయాన్ని సమకూర్చుతూ కీలకంగా ఉండేది. కానీ నిరుడు సగానికిపైగా పడిపోయింది. చివరికి.. కరోనా విపత్తు కంటే ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రభావం చూపిందని గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్ పాలనలో రియల్ ఎస్టేట్ ఆదాయం ఏటేటా పెరుగుతూరాగా.. రాష్ట్ర చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ హయాంలో తిరోగమనం నమోదైంది.
తెలంగాణ ఏర్పడినప్పుడు స్టాంపులు రిజిస్టేషన్ల శాఖ ద్వారా ఖజానాకు వచ్చిన ఆదాయం రూ.3,105 కోట్లు మాత్రమే. 2022-23 నాటికి రూ.14,228 కోట్లకు పెరిగింది. అంటే.. ఆదాయం నాలుగున్నర రెట్లు పెరిగింది. సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణం, అనేక పథకాలు, కార్యక్రమాలతో వ్యవసాయ రంగాన్ని బాగుచేయడం, భారీగా పరిశ్రమల రాక, కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల వృద్ధి.. ఇలా పక్కా ప్రణాళికతో నిర్మాణాత్మకంగా అభివృద్ధి జరిగింది. దీంతో అదేస్థాయిలో రియల్టీ కార్యకలాపాలు పెరిగాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రూ.2 లక్షలు కూడా పలకని ఎకరం భూమి విలువ.. పదేండ్లలో అనేక రెట్లు పెరిగింది. మారుమూల ప్రాంతాల్లోనూ రూ.30-50 లక్షలు పలికింది. హైదరాబాద్లో ఎకరం భూమి రూ.100 కోట్ల వరకు పలికిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఏకంగా నాలుగు రెట్లు పెరిగింది.
2024-25లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు
రాబడి అంచనా 18228.82 కోట్లు, వచ్చింది.. 8473.21 కోట్లు
అంచనాలో చేరిన లక్ష్యం: 46.48%
2023-24లో ఆదాయం: 14295 కోట్లు
2024-25లో ఆదాయం : 8473 కోట్లు
తగ్గుదల: 5,822 కోట్లు, తగ్గిన శాతం: 40.7%