సింహాచలం చందనోత్సవంనాడు గోడ కూలి ఏడుగురు భక్తులు మరణించిన ఘటనకు బాధ్యులైన దేవస్థానం ఇన్చార్జి ఈవో కె.సుబ్బారావు సహా ఏడుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. సింహగిరిపై జోడుభద్రాలు వద్ద ఓ భారీ గోడను ఉత్సవానికి ఐదు రోజుల ముందు నిర్మించారు. ఆ పక్క నుంచే రూ.300 క్యూలైన్ ఏర్పాటుచేశారు. గత 29వ తేదీ రాత్రి కురిసిన భారీవర్షానికి ఆ గోడ మర్నాడు కూలిపోయి ఏడుగురు భక్తులు మరణించారు. దీనిపై విచారణకు ప్రభుత్వం పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్కుమార్, ‘ఈగల్’ ఐజీ ఆకె రవికృష్ణ, జలవనరుల శాఖ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావుతో త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేసింది. వారు మరుసటిరోజే సింహాచలం వచ్చి కొండపైకి వెళ్లి ఘటనా స్థలంలో విచారణ చేశారు. ఆ తర్వాతి రోజు విశాఖ ప్రభుత్వ అతిథిగృహంలో మరోసారి అందరినీ విచారించారు. మొత్తం 19 మందితో మాట్లాడారు. ఎటువంటి డిజైన్, అనుమతులు లేకుండా గోడను నిర్మించినట్లు తేల్చారు.
Add A Comment