ఏపీలో సింహాచలం ఆలయ గోడ కూలిన ఘటనలో 8 మంది భక్తులు చనిపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. అయితే విచారణలో ఈ గోడ నిర్మించిన కాంట్రాక్టర్ ఇవాళ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. అధికారుల కమిటీ అడిగిన ప్రశ్నలకు కాంట్రాక్టర్ ఇచ్చిన సమాధానాలు చూస్తే ఈ గోడ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆర్ధమవుతోంది.
సింహాచలం గోడ కూలిపోయిన సంఘటనలో పాలనా పరమైన నిర్లక్ష్యం, అధికారుల ఒత్తిడి ఉన్నట్లు కాంట్రాక్టర్ లక్షణరావు ఇాళ వెల్లడించాడు. చందనోత్సవానికి ముందు చాలా తక్కువ సమయం మాత్రమే ఉందని తాను చెప్పానని, నిర్మాణాన్ని చేపట్టడానికి ముందు నిరాకరించానని వెల్లడించాడు. తక్కువ సమయం మిగిలి ఉందని, కేవలం ఆరు రోజుల్లో గోడ నిర్మించడం సాధ్యం కాదని అధికారులకు స్పష్టంగా చెప్పానన్నారు.
అయితే తన అభ్యంతరాలను దేవస్థానం, పర్యాటక శాఖ అధికారులు పట్టించుకోలేదని, నిర్మాణంపై ముందుకు సాగాలని పట్టుబట్టారని వెల్లడించాడు. వారు గోడ నిర్మించమని తనపై ఒత్తిడి తెచ్చారని, ఇది తాత్కాలిక నిర్మాణం మాత్రమే అని తనకు చెప్పినట్లు తెలిపాడు. పండుగకు నాలుగు రోజుల ముందు పని ప్రారంభించామని, నిర్మాణ సమయం, నాణ్యతపై ఆందోళన ఉందని వెల్లడించాడు. చివరకు ఈ ఘటన చోటు చేసుకుందని వాపోయాడు.
సింహాచలంలో భారీ వర్షం కారణంగా గోడ కూలిన ఘటనలో 8 మంది భక్తులు మృత్యువాత పడ్డారు. ఈ గోడ నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాల వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో వైసీపీ, కూటమి పార్టీల మధ్య మాటల యుద్దం కూడా సాగుతోంది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ ఇలా అసలు విషయం బయటపెట్టడంతో ప్రభుత్వం ఇరుకునపడింది.