వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పిన సింగరేణి (Singareni) సంస్థ మరో వినూత్న విద్యుత్ ఉత్పాదన ప్లాంట్ ఏర్పాటుకు రంగంలోకి దిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలతో రామగుండం-1 ఏరియాలో మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని వాటర్ సంపు ఆధారంగా పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రాథమిక అధ్యయనాలు పూర్తిచేసిన కంపెనీ సంపూర్ణ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించడానికి వ్యాప్కోస్ లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ సంస్థకు బాధ్యతలను అప్పగిస్తూ లెటర్ ఆఫ్ అవార్డును అందజేసినట్లు సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు.
ఈ తరహా ప్రాజెక్ట్ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎవరూ చేపట్టలేదని సింగరేణి సంస్థ దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టడమే కాక విజయవంతంగా నిర్వహిస్తోందన్న నమ్మకం తమకు ఉందని అన్నారు. ఈ ప్లాంటును ఏర్పాటు చేయనున్న మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సంపును, నిర్మాణ ప్రాంతాన్ని ఇప్పటికే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖా మాత్యులు మల్లు భట్టి విక్రమార్క సందర్శించారని, ఈ వినూత్న ప్రాజెక్టును చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థ అప్పగించిన బాధ్యతల ప్రకారం వ్యాప్కోస్ లిమిటెడ్ సంస్థ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ సంపు ఆధారంగా 500 మెగావాట్ల పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ని నిర్మించడానికి సంబంధించిన పూర్తి అధ్యయనం చేస్తోంది. జియోలాజికల్, జియోటెక్నికల్, హైడ్రాలజీ అధ్యయనాలతో పాటు సివిల్ డిజైన్లు, ఉత్పత్తి సామర్థ్య అంశాలు మెకానికల్, ఎలక్ట్రికల్ డిజైన్లు, పర్యావరణ సంబంధ అంశాలు, రక్షణ చర్యలు వంటి విషయాలపై సమగ్ర అధ్యయనాన్ని జరిపి డీపీఆర్ను రూపొందించాల్సి ఉంటుంది. ప్లాంట్ నిర్మాణానికి పట్టే సమయం, నిర్మాణపు ఖర్చు, ప్లాంట్ పూర్తయిన తర్వాత ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తు అమ్మకాలకు గల అవకాశాలు తదితర అనేక విషయాలను డీపీఆర్లో పొందుపరచనున్నారు.
ఈ పంపుడు స్టోరేజ్ ప్లాంట్ ఒక రకంగా చెప్పాలంటే జల విద్యుత్ ప్రాజెక్టు తరహాలో పనిచేస్తుంది. జల విద్యుత్తు కేంద్రాల్లో నీటి ప్రవాహ ఉధృతికి టర్బైన్లు తిరగటంతో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అయితే అక్కడ సహజ సిద్ధమైన జలపాతాల నీటిని ఇందుకోసం వినియోగిస్తారు. కాగా పంపుడు స్టోరేజీ ప్లాంట్లు ఎత్తయిన ప్రదేశానికి తోడిన నీటిని కిందికి వదలడం ద్వారా టర్బైన్లను తిప్పి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది.
ప్రస్తుతం మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో సుమారు 157 మీటర్ల లోతున భారీ నీటి సంపు ఏర్పడి ఏడాది పొడుగునా భారీ పరిమాణంలో నీరు నిల్వ ఉంటుంది. ఈ నీటిని ఉపరితలంపై నిర్మించనున్న దాదాపు ఇదే పరిమాణం గల మరో భారీ నీటి రిజర్వాయర్ లోకి పగటిపూట సోలార్ విద్యుత్ ద్వారా పంపింగ్ జరుపుతారు. ఈ విధంగా పగటిపూట నింపిన నీటిని భారీ పైపుల గుండా రాత్రివేళ కిందికి పంపిస్తూ ఆ జల శక్తితో, మధ్యలో ఏర్పాటు చేసిన టర్బైన్లను తిప్పడంతో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కింద ఉన్న నీటిని పైకి పంపిణీ చేసి, అలా అక్కడ నిలువ చేసిన నీటిని కిందికి పంపి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా చేయడాన్ని పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ అని పిలుస్తారు.
మూతబడిన మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గనిలో గల భారీ నీటి సంపు, ఉపరితలంలో రిజర్వాయర్ నిర్మించడానికి ఖాళీ ప్రదేశ లభ్యతలు ఇక్కడ ఉండటంతో సింగరేణి మొత్తంలో ఈ ప్రాజెక్ట్ని ఇక్కడే ఏర్పాటు చేయాలని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఉపరితలంపై నీటి నిల్వ కోసం సుమారు 2,350 మీటర్ల పొడవుతో 23 మీటర్ల లోతు గల రిజర్వాయర్ డ్యామును నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్లో 9.64 మిలియన్ క్యూబిక్ మీటర్ల పరిమాణం గల నీటిని నిలువ చేసి దీనిలో నుంచి పంపింగ్ కోసం 8 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని వినియోగిస్తారు. ప్రాజెక్ట్ వ్యయం సుమారు రూ.3000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. అయినప్పటికీ 40 ఏళ్ల పాటు 500 మెగావాట్ల సామర్థ్యం గల ఈ పంప్డ్ స్టోరేజీ ప్లాంటు సింగరేణికి గట్టి ఆర్థిక పరిపుష్టిని కలిగిస్తుంది. వ్యాప్కోస్ లిమిటెడ్ సంస్థ డీపీఆర్ సిద్ధం చేయగానే నిర్మాణానికి సంబంధించిన టెండర్లు పిలిచే అవకాశం ఉంది.