గోవాలో విషాదం చోటు చేసుకుంది. శిర్ గావ్ ప్రాంతంలో ఉన్న శ్రీ లైరాయిదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. దాదాపు 30 మందికి పైగా గాయాలపాలవ్వగా.. ఆరుగురు మృతి చెందారు. గాయపడిన వారి లో చాలామంది పరిస్థితి తీవ్రంగా ఉందని అంటున్నారు అధికారులు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు.
అమ్మవారి దేవాలయంలో ఏడాదికోసారి వైశాఖ మాసంలో జాతర జరుగుతుంది. శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది. పార్వతీదేవి అవతారంగా భావించే లరాయ్ అమ్మవారిని దర్శించుకునేందుకు గోవాలోని నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ ఆలయంలో దొండాచీ యాత్ర ప్రధానంగా చేస్తారు. ఈ యాత్రలో భాగంగా నిప్పులపై నడుస్తారు. శనివారం తెల్లవారే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో పాల్గొనడానికి భక్తులు భారీ వస్తుంటారు. ఇక్కడే తొక్కిసలాట మొదలయ్యింది. ఈ ఘటనలో అక్కడిక్కడే ఆరుగురు మరణించారు. నార్త్ గోవా డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరామర్శించారు.