ఎస్ఎల్బీసీ సొరంగంలో 14వ కిలో మీటర్ పాయింట్ వద్ద ఈ నెల 22న ఉదయం 8.20 గంటలకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఒక్కసారిగా భారీగా నీరు, మట్టి, రాళ్లు వచ్చి టన్నెల్ బోర్ మిషన్పై పైకప్పు కూలింది. ఈ క్రమంలో టీబీఎం ముందు భాగంలో పనులు చేస్తున్న ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు అందులో చిక్కుకుపోయారు. ఏడు రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగించారు.
అయితే ఈరోజు వార్తల ప్రకారం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు. మూడు మీటర్ల లోతులో రెస్క్యూ టీం మృతదేహాలను గుర్తించింది. అధునాతన పరికరాలు, రాడార్లతో మృతదేహాలను గుర్తించినట్లు రెస్క్యూ టీం తెలిపింది. మృతుల్లో కార్మికులుఆరు మంది, ఇద్దరు ఇంజినీర్లు ఉన్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఎనిమిది మంది చిక్కుకున్న ప్రదేశాన్ని జిపిఆర్ఎస్ ద్వారా స్పాట్ చేసినట్టు ప్రాథమిక నివేదిక ద్వారా తెలిసింది. రేడియో తరంగాల ద్వారా కార్మికులు చిక్కుకున్న ప్రదేశాన్ని క్షుణంగా పరిశీలించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. విపత్తు నిర్వహణ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ నేతృత్వంలో ఉన్నత అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ విషయం గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.