సోమశిల వద్ద కృష్ణా నదిపై రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడేళ్ల క్రితమే ఈ కేబుల్ బ్రిడ్జిని చేపట్టాల్సి ఉండగా కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈ ప్రాజెక్టు రద్దయింది. ఇటీవల దాన్ని నేషనల్ హైవేస్ ఒరిజినల్ (ఎన్ హెచ్ ఓ) జాబితాలోకి మార్చడంతో ప్రాజెక్టు మళ్ళీ తెరపైకి వచ్చింది. 800 మీటర్ల నిడివి కలిగి ఉండే ఈ బ్రిడ్జి నిర్మాణంకు రూ.1,062 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా కృష్ణా నది ఇవతల తెలంగాణలోని మల్లేశ్వరం నుంచి, అవతల ఏపీలోని సంగమేశ్వరం పుణ్యక్షేత్రాలను కలుపుతూ తెలంగాణ – ఏపీ మధ్య మరోమార్గం ఏర్పడనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మార్గం ద్వారా తెలంగాణ నుంచి తిరుపతికి మధ్య దూరం తగ్గనుంది. తెలంగాణ నుండి ప్రస్తుతం నంద్యాల, తిరుపతికి వెళ్ళాలంటే కర్నూలు మీదుగా చుట్టూ తిరిగి వెళ్ళకతప్పని పరిస్థితి. అదే కొల్లాపూర్ మీదుగా కృష్ణా నదిని దాటేలా కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. తెలంగాణ నుండి తిరుపతికి దాదాపు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
కృష్ణా నదిపై సోమశిల వద్ద ప్రతిపాదిత రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి దేశంలోనే ఇప్పటి వరకు లేని తరహాలో కొత్త డిజైన్ తో రూపుదిద్దుకోనుంది. దేశంలో రెండు వరుసల వంతెనలు అరుదు. అందులోనూ కేబుల్ కమ్ సస్పెన్షన్ బ్రిడ్జితో పర్యాటకులు అక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు గాజుతోకూడిన డిజైన్ తో నడకదారి అనుసంధానించడం ఇప్పటివరకు ఎక్కడా లేదు. తొలిసారి సోమశిల వద్ద రూపుదిద్దుకోనుంది.
నదిపై ఏర్పాటు చేయనున్న బ్రిడ్జి పైభాగంలో నాలుగు వరుసల రోడ్డు ఉంటుంది. దానిమీదుగా వాహనాలు వెళ్తాయి. దిగువన రెండో వరుసలో పర్యాటకులు నడుచుకుంటూ వెళ్లేలా గాజు ప్యానెల్స్ తో కూడిన డెక్ ఉంటుంది. దీంతో ఈ ప్రాజెక్టు పూర్తయితే అక్కడికి వెళ్లే పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా, ప్రకృతి సోయగాన్ని చూస్తూ గాజు డెక్ నుండి కృష్ణానది వయలని ఆస్వాదిస్తూ వంతెన దాటొచ్చు.