Thursday, 15 January 2026

ఇండియన్ క్రికెట్ టీం ముఖ్యమైన స్పాన్సర్‌గా వైదొలగిన డ్రీమ్11

ఆసియా కప్ 2025 ప్రారంభానికి కొద్ది వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో భారత క్రికెట్ జట్టుకు మైదానం బయట ఊహించని షాక్ తగిలింది. జట్టు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11, తమ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్ర‌క‌టించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన ‘ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025’ కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ కొత్త చట్టం ప్రకారం, డబ్బుతో ఆడే ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లను నిషేధించడమే డ్రీమ్11 వైదొలగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఈ అనూహ్య పరిణామంతో బీసీసీఐ అప్రమత్తమైంది. త్వరలోనే జెర్సీ స్పాన్సర్‌షిప్ హక్కుల కోసం కొత్త బిడ్లను ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. అయితే, సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కేవలం రెండు వారాల వ్యవధిలో కొత్త స్పాన్సర్‌ను ఖరారు చేయడం బీసీసీఐకి కత్తిమీద సాములా మారింది. భారత జట్టు స్పాన్సర్‌షిప్‌కు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉన్నప్పటికీ, ఇంత తక్కువ సమయంలో ప్రక్రియను పూర్తి చేయడం సవాలుగా మారింది.

ఒకవేళ టోర్నమెంట్ ప్రారంభమయ్యేలోపు కొత్త స్పాన్సర్ ఖరారు కాకపోతే, ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరున్న బీసీసీఐ ఆధ్వర్యంలోని భారత జట్టు, జెర్సీపై ప్రధాన స్పాన్సర్ లోగో లేకుండానే బరిలోకి దిగాల్సి వస్తుంది. ఇది చాలా అరుదైన సంఘటన అవుతుంది. ఇప్పటికే డ్రీమ్11 లోగోతో జెర్సీలను ముద్రించినప్పటికీ, వాటిని టోర్నమెంట్‌లో ఉపయోగించబోరని సమాచారం.

గతంలో ఆర్థిక సంక్షోభం కారణంగా బైజూస్, న్యాయపరమైన చిక్కులతో సహారా వంటి సంస్థలు కూడా టీమిండియా స్పాన్సర్‌షిప్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాయి. ఇప్పుడు డ్రీమ్11 కూడా అదే జాబితాలో చేరింది. 2023 జులైలో బీసీసీఐ, డ్రీమ్11 మధ్య మూడేళ్ల కాలానికి గాను రూ.358 కోట్లతో ఒప్పందం కుదిరింది. కానీ, కొత్త చట్టం కారణంగా ఈ ఒప్పందం ఏడాదికే ముగిసిపోతోంది. ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా స్పందించనప్పటికీ, బోర్డు కార్యదర్శి దేవాజిత్ సైకియా మాట్లాడుతూ, “భారత ప్రభుత్వ చట్టాలను బీసీసీఐ కచ్చితంగా పాటిస్తుంది. చట్టప్రకారం అనుమతి లేని ఏ పనినీ మేము చేయబోము” అని అన్నారు.

ఇవి తప్పక చదవండి

ఎఫ్.ఏ కప్ నాలుగో రౌండ్ డ్రా ఖరారు

లివర్‌పూల్ జట్టు బార్న్స్లీపై 4-1 తేడాతో ఘనవిజయం సాధించిన తర్వాత ఎఫ్.ఏ కప్ నాలుగో రౌండ్ సందడి మొదలైంది. సోమవారం రాత్రి జరిగిన డ్రాలో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ఖరారయ్యాయి. ఈ రౌండ్‌లో ముఖ్యంగా...

నేటి స్కాటిష్ బడ్జెట్: ఆర్థిక సవాళ్ల మధ్య షోనా రాబిన్సన్ కీలక నిర్ణయాలు

నేడు మంగళవారం మధ్యాహ్నం 2:20 గంటలకు స్కాటిష్ ఆర్థిక మంత్రి షోనా రాబిన్సన్ హోలీరూడ్ అసెంబ్లీలో 2026-27 సంవత్సరానికి గానూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 6,000 కోట్ల పౌండ్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వం...

తీవ్ర ఒత్తిడిలో హాస్పిటల్స్: నాలుగు ఎన్.హెచ్.ఎస్ ట్రస్ట్‌లలో ‘క్రిటికల్’ పరిస్థితులు

సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్: చలి తీవ్రత పెరగడం, ఫ్లూ మరియు నోరోవైరస్ కేసులు ఊహించని రీతిలో పెరగడంతో సరీ, కెంట్ మరియు ససెక్స్ ప్రాంతాల్లోని నాలుగు కీలక ఎన్.హెచ్.ఎస్ (NHS) హాస్పిటల్ ట్రస్ట్‌లు...

ఎక్కువ మంది చవివినవి

సంబంధిత కథనాలు