IPL 2025 లో భాగంగా SRH (సన్రైజర్స్ హైదరాబాద్) జట్టు ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లు ఆడగా, ఒక మ్యాచ్ లో విజయం సాధించింది. విశాఖపట్టణం వేదికగా ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఈ మ్యాచ్ కు ముందు సన్రైజర్స్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ రాసిన లేఖ బయటకు రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (HCA) తమను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందంటూ, హైదరాబాద్ నగరాన్ని విడిచి వెళ్లిపోతామని హెచ్చరించారు.
IPL మ్యాచ్ లు జరుగుతున్న వేళ HCA వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. IPL ఉచిత టికెట్ల కోసం HCA నుంచి బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్ ఎక్కువవుతుందని ఆరోపిస్తూ HCA కోశాధికారికి సన్రైజర్స్ లేఖ రాసింది. ఈ లేఖలో HCA అధ్యక్షుడు జగన్ మోహన్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసింది. కోరినన్ని పాస్ లు ఇవ్వనందుకు ఓ IPL మ్యాచ్ సందర్భంగా తమకు కేటాయించిన కార్పొరేట్ బాక్సుకు తాళాలు వేసినట్లు సన్రైజర్స్ ప్రతినిధి ఆవేదన వ్యక్తం చేశారు.
సన్ రైజర్స్ జనరల్ మేనేజర్ (స్పోర్ట్స్) శ్రీనాథ్ లేఖ ప్రకారం. పన్నెండేళ్లుగా HCAతో కలిసి పనిచేస్తున్నాం. కానీ, గత రెండు సీజన్ల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయి. ఒప్పందం ప్రకారం ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగే సమయంలోHCAకు 10శాతం (3,900) కాంప్లిమెంటరీ టికెట్లు కేటాయిస్తున్నాం. 50సీట్ల సామర్థ్యం ఉన్న F12A కార్పొరేట్ బాక్స్ టికెట్లు కూడా అందులో భాగమే. కానీ, ఈ ఏడాది దాని సామర్థ్యం 30 మాత్రమే అని పేర్కొంటూ, అదనంగా మరో బాక్స్ లో 20 టికెట్లు కేటాయించాలని అడిగారు. దీనిపై చర్చిద్దామని చెప్పాం. మేము స్టేడియానికి అద్దె చెల్లిస్తున్నాం. IPL సమయంలో స్టేడియం మా నియంత్రణలోనే ఉంటుంది. కానీ, గత మ్యాచ్ సందర్భంగా F3 బాక్సుకు తాళాలు వేశారు. అదనంగా 20 టికెట్లు ఇస్తేగానీ తెరవమంటూ బెదిరించారంటూ ఆ లేఖలో పేర్కొన్నారు.