దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు. మరికొద్ది గంటల్లో వారి తిరుగుపయనం మొదలవ్వనుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5.57 గంటలకు వారు భూమ్మీద ల్యాండ్ అవనున్నారు. ఈమేరకు నాసా (NASA) తాజా అప్డేట్ ను ప్రకటించింది.
సునీత, విల్మోర్ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూ కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో అనుసంధానమైన సంగతి తెలిసిందే. ‘క్రూ-10 మిషన్’లో వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్ షెడ్యూల్ ను నాసా తాజా ప్రకటనలో వెల్లడించింది.
-> క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ సోమవారం రాత్రి 10:45 గంటలకు అమెరికా టైం ప్రకారం మొదలవుతుంది.
-> సోమవారం అర్ధరాత్రి 12:45 గంటలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్లాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
-> ఈ స్పేస్లిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 4:45 గంటలకు వ్యోమనౌక భూమికి తిరుగుపయనం చేపడుతుంది.
-> సాయంత్రం 5:11 గంటలకు భూకక్ష్యలను దాటుకుని కిందకు వస్తుంది.
-> సాయంత్రం 5:57 గంటలకు ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ఎక్స్ క్యాప్సూల్ దిగుతుంది. అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారని నాసా వెల్లడించింది.
సునీత, విల్మోర్తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు కూడా భూమ్మీదకు రానున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక star liner లో సునీత, విల్మోర్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారంరోజులకే భూమిని చేరుకోవాల్సిఉంది. అయితే star liner సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత, విల్మోర్లు international space station లోనే చిక్కుకుపోయారు.