కంచ గచ్చిబౌలిలో ధ్వంసం చేసిన అటవీప్రాంతాన్ని పునరుద్ధరిస్తారా? లేదా అధికారులను జైలుకు పంపమంటారా?’ అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే యూనివర్సిటీ పక్కన అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసినట్టు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తున్నదని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తారో లేక తమ అధికారులను జైలుకు పంపుతారో రాష్ట్ర ప్రభుత్వమే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
సుధీర్ఘ వారాంతపు సెలవుల సమయంలో, కోర్టులు అందుబాటులో లేని పరిస్థితిని అవకాశంగా తీసుకొని చెట్లను ధ్వంసం చేయాల్సిన అవసరమేమొచ్చిందని ధర్మాసనం నిలదీసింది. ‘ప్రాథమికంగా చూస్తే, ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగినట్టు తెలుస్తున్నది. వరుసగా 3 రోజులు సెలవులు వస్తున్నాయి, కోర్టులు పనిచేయవని మీకు తెలు సు’ అని సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలి లో అటవీ ప్రాంతం ధ్వంసం చేయడాన్ని సుమోటో గా స్వీకరించిన సుప్రీంకోర్టు అక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని గత ఏప్రిల్ 3న ఆదేశించింది.
ఈ కేసులో గురువారం జరిగిన విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కంచె గచ్చిబౌలిలో ప్రభుత్వం తన కార్యకలాపాలను మొత్తం నిలిపివేసిందని చెప్పారు. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను ‘తు చ’ తప్పకుండా పాటిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘అటవీ పునరుద్ధరణకు ప్రభుత్వం వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా? లేదా?’ అని ప్రశ్నించింది. ఆ ప్రాంతంలో భారీస్థాయిలో మొక్కల పెంపకం చేపడుతున్నట్టు సింఘ్వీ చెప్పారు. రాబోయే వానకాలంలో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. దీనిపై అమికస్ క్యూరీ, సీనియర్ న్యాయవాది కే పరమేశ్వర్ స్పందిస్తూ.. ధ్వంసం చేసిన ప్రాంతంలో మొక్కలు నాటడం లేదన్నారు. కంచె గచ్చిబౌలిలో జరిపిన విధ్వంసంపై ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఉపగ్రహ చిత్రాల సాయంతో సర్వే చేసి ఇటీవల కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)కి నివేదిక ఇచ్చిందని చెప్పారు. దీని ప్రకారం ధ్వంసమైన 104 ఎకరాల్లో 60 శాతం భూమిలో ఓ మోస్తరు నుంచి దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నదని తెలిపారు. దీనిపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ ‘కోర్టు ధిక్కరణ అభియోగం నుంచి తప్పించుకోవాలంటే అడవిని పునరుద్ధరించాలన్న నిర్ణయం తీసుకోవడం మంచిది’ అని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ధ్వంసమైన అటవీ ప్రాంతానికి సంబంధించిన ఫొటోలను ప్రస్తావిస్తూ.. చెట్లను నరికివేసే ముందు పర్యావరణ అనుమతులు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. ‘ఒకవేళ అనుమతులు తీసుకొని ఉంటే పనులను సోమవారం నుంచి ఎందుకు ప్రారంభించలేదు’ అని నిలదీశారు. ఈ సందర్భంగా సింఘ్వీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. తమ ప్రధానకార్యదర్శితోపాటు మరో అరడజను అధికారులను తాత్కాలిక జైలుకు పంపాలా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒకవేళ అక్కడ అడవిని పునరుద్ధరించదలచుకుంటే ఆ పనిని వచ్చే వానకాలంలో చేపట్టవచ్చునని మరో న్యాయవాది సూచించారు. ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో తమ చర్యను సమర్థించుకున్నదని, అక్క డ ఐటీ నిర్మాణంతో ముందుకెళ్లనున్నట్టు స్పష్టం చేసిందని తెలిపారు.
అడవి పునరుద్ధరణకు ఎటువంటి ప్రణాళికను ప్రభుత్వం కోర్టు ముందుంచలేదని చెప్పా రు. దీనిపై సింఘ్వీ జోక్యం చేసుకుంటూ.. అక్కడ పర్యావరణ పరిరక్షణ, ఐటీ రెండూ కొనసాగేలా కోర్టును ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని అన్నా రు. దీనిపై సీజేఐ స్పందిస్తూ.. ‘సుస్థిర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ వారాంతపు సెలవులను అడ్డుపెట్టుకొని వేలాది చెట్లను నరకడం గురిం చి మాత్రమే మేం మాట్లాడుతున్నాం’ అన్నారు. ప్రభు త్వం చేసిన పనిని సమర్ధించుకోవద్దని, ధ్వంసం చేసిన ప్రాంతంలో అటవిని పునరుద్ధరిస్తారో లేదో చెప్పాలని స్పష్టం చేశారు. మరో న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. అక్కడ అడవిని రక్షించాలనుకున్న విద్యార్థుల పక్షాన ఒక దరఖాస్తును కోర్టుకు నివేదించినట్టు చెప్పారు. వర్సిటీలో పరీక్షలు జరుగుతుండగా, విద్యార్థులు ఎఫ్ఐఆర్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనికి సంబంధించి ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేయాలని, ప్రస్తుతానికి తాము అడవి పునరుద్ధరణపైనే దృష్టి సారిస్తున్నామని, దీని పరిధిని పెంచవద్దని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం కేసు తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది.