గత ప్రభుత్వ హయాంలో పార్టీ మారిన MLAల విషయంలో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతుందని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తెలంగాణ CM రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తప్పుపట్టింది. నిజంగానే నిండు సభలో CM ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే, రాజ్యాంగంలోని (ప్రజాప్రతినిధుల ఫిరాయింపులకు సంబంధించిన) 10వ షెడ్యూలును అపహాస్యం చేయడం కిందికే వస్తుందని జస్టిస్ BR గవాయ్, జస్టిస్ AG మాసీహ్తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.
BRS నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన MLAలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. BRS నేత పాడి కౌశిక్ రెడ్డి తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ ఆర్యామ సుందరం మార్చి 26న అసెంబ్లీలో స్పీకర్ సాక్షిగా CM చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ ఈ సమయంలో జోక్యం చేసుకుని, జరుగుతున్న విచారణ అసెంబ్లీ ప్రొసీడింగ్స్ గురించి కాదన్నారు. దీనికి జస్టిస్ గవాయ్ ఎక్కడో రామ్లీలా మైదానంలో అన్నమాటలకు, చట్టసభలో మాట్లాడే మాటలకు తేడా ఉంది.
అసెంబ్లీలో ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నాడంటే దానికి ఒక పవిత్రత ఉంటుంది. సభలో ఒక మంత్రి ఏదైనా ప్రకటన చేస్తే, చట్టాన్ని నిర్వచించడానికి ఆ ప్రకటనను ఆధారంగా చేసుకోవచ్చంటూ గతంలో కొన్ని తీర్పులు కూడా వచ్చాయి అన్నారు. దీనికి రోహత్గీ తాను ముఖ్యమంత్రి తరఫున వాదనలు వినిపించడానికి రాలేదని చెప్పగా, మిస్టర్ రోహత్గీ గతంలో మీరు మరోకేసులో ఇదే CM తరపున వాదనలు వినిపించారు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయనకు చెప్పండి, అని జస్టిస్ గవాయ్ అన్నారు. తాము ధిక్కరణ నోటీసులు ఇవ్వడానికి ఆలోచిస్తాం తప్ప ఆ అధికారాలు లేనివాళ్లతో కాదని ఆయన వ్యాఖ్యానించారు.