అవినీతి ఆరోపణలతో సస్పెండ్ అయిన ఓ ఏఎస్ఐ ఇంట్లో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి. అది కూడా అధునాతన ఏకే 47, ఏకే 56 వంటి ఆయుధాలు కావడం అలాగే, వెతుకుతున్న కొద్దీ బుల్లెట్ మ్యాగ్జిన్లు లభిస్తుండంతో సోదాలకు వెళ్లిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. పోలీసులకు ఇప్పటి వరకు దాదాపు 500 రౌండ్ల బుల్లెట్లు లభించగా, ఇంకా సోదాలను కొనసాగిస్తున్నారు. బిహార్లోని సమస్తిపూర్లో ఈ ఘటన సంచనలంగా మారింది.
మొహియుద్దీన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఏఎస్ఐ సరోజ్ సింగ్ అవినీతి ఆరోపణలతో ఏడాది క్రితం సస్పెండ్ అయ్యాడు. చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేయడం, నేరస్థులతో చేతులు కలిపి అక్రమంగా ఆయుధాలను రవాణా చేయడం వంటి ఆరోపణలు అతనిపై ఉన్నాయి. ఇద్దరు వ్యక్తుల హత్యకు సరోజ్ సింగ్తో పాటు అతని అనుచరులు ముగ్గురు కుట్ర పన్నినట్లు పోలీసులకు సమాచారం అందింది. హత్యల కోసం ఆయుధాలను సమకూర్చుకున్నట్లు తెలిసింది. దీంతో STFతో పాటు, పటోరి మోహన్పూర్, మొహద్దినగర్, విద్యాపతి నగర్ పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీసులు సంయుక్తంగా దాడి చేసారు. పోలీసులను చూసిన సరోజ్ సింగ్ పారిపోయేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఇదే సమయంలో పోలీసులపై కాల్పులు కూడా జరిపారు.
ఆ తర్వాత పోలీసులు సరోజ్ సింగ్ సహా నలుగురి అరెస్టు చేసారు. అనంతరం సరోజ్ సింగ్ ఇంట్లో సోదాలను నిర్వహించారు. ఈ క్రమంలో ఇంటి నుంచి దాదాపు 500 రౌండ్ల బుల్లెట్లు, ఏకే 47, ఏ56, డబుల్ బారెల్ గన్, మూడు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు ఇంకా లభించే అవకాశం ఉండటంతో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.అయితే ఈ సోదాలను ధృవీకరించిన స్థానిక పోలీసులు, అక్కడ స్వాధీనం చేసుకున్న ఆయుధాలపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. సోదాలు ముగిసిన తర్వాత వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. సోదాల నేపథ్యంలో సుల్తాన్పుర్లోని కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని పోలీసులు స్థానికులను ఆదేశించడం గమనార్హం.