వాక్ స్వేచ్ఛను (Freedom of Speech) కాపాడడంలో విఫలమైనందుకు, ఉన్నత విద్య నియంత్రణ సంస్థ “ఆఫీస్ ఫర్ స్టూడెంట్స్” (OFS) ద్వారా Sussex University కి సుమారు 6.50 Cr జరిమానా విధించబడింది.
సెక్స్, జెండర్ సమస్యలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేసినందుకు ట్రాన్స్ఫోబియా ఆరోపణలు ఎదుర్కొని 2021లో విశ్వవిద్యాలయాన్ని విడిచిపెట్టిన ప్రొఫెసర్ కాథ్లీన్ స్టాక్ కేసుతో OFS దర్యాప్తు ప్రారంభమైంది.
“ట్రాన్స్ వ్యక్తుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలనే” నిబంధనతో పాటు ట్రాన్స్, నాన్-బైనరీ సమానత్వంపై విశ్వవిద్యాలయం యొక్క “పాలసీ స్టేట్మెంట్” సిబ్బంది, విద్యార్థులు తమ వ్యతిరేక అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా నిరోధించడానికి దారితీయవచ్చని OFS తెలిపింది.
సస్సెక్స్ విశ్వవిద్యాలయం OFS నిర్ణయాలను చట్టబద్ధంగా సవాలు చేయాలని యోచిస్తున్నట్లు వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ సాషా రోసెనీల్ తెలిపారు. ఈ తీర్పును “స్వేచ్ఛా ప్రసంగానికి అసమంజసమైన నిరంకుశ నిర్వచనం”గా అభివర్ణిస్తూ, ఈ తీర్పు సంస్థలను “దుర్వినియోగం, బెదిరింపు, వేధించే ప్రసంగాన్ని నిరోధించడానికి శక్తిహీనులను” చేస్తుందని విశ్వవిద్యాలయం పేర్కొంది.
ప్రొఫెసర్ కాథ్లీన్ స్టాక్ ట్రాన్స్ వ్యక్తులకు అండగా వున్న ససెక్స్ యూనివర్సిటీకి వున్న పాలసీ స్టేట్మెంట్ ని తప్పుపట్టి ట్రాన్స్ ఫోబియా ఆరోపణలతో గట్టి వ్యతిరేకతని ఎదుర్కొని యూనివర్సిటీని వదిలిపెట్టారు. అది యూనివర్సిటీ విద్యార్ధుల ఘనత కిందే చెప్పాలి. వాక్ స్వేచ్ఛ అంటే ఇతరులు న్యాయబద్ధంగా తమ ఇష్టలకు అనుగుణంగా జీవించే హక్కులను కూడా విమర్శించి, వారు తమ ఉనికి పట్ల న్యూనతాభావాన్ని పెంచుకునేలా వ్యాఖ్యలు చేయటమేనా అనేది ముఖ్యమైన ప్రశ్న. అయితే OFS మాత్రం విద్యార్ధుల ఆందోళనని, యూనివర్సిటీ స్టేట్మెంట్ పాలసీని తప్పు పట్టింది. OFS నిర్ణయంలో ససెక్స్ యూనివర్సిటీ పేర్కొన్నట్లు ఏది వాక్ స్వేచ్ఛ అని నిర్ణయించటంలో ఒక నిరంకుశత్వానికి పాల్పడినట్లే అనిపిస్తుంది. యూనివర్సిటీ న్యాయపోరాటానికి పూనుకున్నది కనుక ఫలితం కోసం వేచి చూద్దాం!